
కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం...
సాక్షి ప్రతినిధి, కడప: బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కె.రితీష్రెడ్డి అడుగులకు రెవెన్యూ అధికారులు మడుగులొత్తుతున్నారు. ఆయన అవినీతి.. అక్రమాలకు ఎంచక్కా ద్వారాలు తెరిచి జీ హుజూ ర్ అంటూ ఆయన సేవలో తరిస్తున్నారు. వేలు లక్షలు కాదు..కోట్లాది రూపాయాల విలువైన ప్రభుత్వ భూమి దర్జాగా ఆక్రమించుకుంటుంటే నిద్ర మత్తులో జోగుతున్నారు. ఆర్డీఓ, జేసీ రెవెన్యూ కోర్టులు ప్రభుత్వ భూమిగా నిర్దేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చినా ఆ విషయాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లకుండా నాన్చుతున్నారు.
● బి.కోడూరు మండలం వేముకుంట గ్రామంలో సర్వే నంబర్ 18లో 16.50 ఎకరాలు ప్రభుత్వ గయ్యాలి భూమిని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తన అనుచరుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నేపధ్యంపై గ్రామస్తులు రెవెన్యూ కోర్టులను ఆశ్రయించారు. రాజంపేట ఆర్డీఓ కోర్టు (ఈ3)/1916/2016లో ద్వారా 2016లో ప్రభుత్వ గయ్యాలి భూమిగా తీర్పు ఇచ్చింది. ఆపై రితేష్రెడ్డి కడప జాయింట్ కలెక్టర్ కోర్టును ఆశ్రయించగా జేసీ కోర్టు సైతం ఆర్డీఓ కోర్టు తీర్పును సమ్మతిస్తూ ప్రభుత్వ గయ్యాలి భూమిగా డిసెంబర్ 23, 2022 తేదిన ఉత్తర్వులు ఇచ్చింది. ఆపై బి.కోడూరు తహశీల్దార్, వేముకుంట గ్రామస్తుల సమక్షంలో పంచనామా చేపట్టి, సర్వే నంబర్ 18లో 16.50ఎకరాలు భూమిని స్వాధీనం చేసుకున్నారు.
ఎన్ఓసీ సృష్టించి ఎలక్ట్రికల్ సర్వీసు...
ప్రభుత్వ భూమిగా అధికారులు, కోర్టులు స్పష్టంగా చెప్పిన సదరు భూమిని తాజాగా రితేష్రెడ్డి తప్పుడు ఎన్ఓసీ సృష్టించారు. తద్వారా ఎలక్ట్రికల్ సర్వీసు పొందారు. పైగా అక్కడ వ్యవసాయ బోరు లేకపోయినా ఎలక్ట్రికల్ సర్వీసు పొందడం మరోవింతగా స్థానికులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఆ పొలంపై హైకోర్టు స్టేటస్–కో ఇచ్చింది. అంటే భూమి యఽథాస్థితిలో కొనసాగించాలి. అలా కాకుండా రితేష్రెడ్డి నేతృత్వంలో మొత్తం భూమి చదును చేసి, చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.
రితీష్ అడుగులకు రెవెన్యూ మడుగులు!
2016లో ఆర్డీఓ, 2022లో జేసీ కోర్టులు ప్రభుత్వ భూమిగా తీర్పు
ఆపై హైకోర్టు నుంచి ‘స్టేటస్–కో’తెచ్చుకున్న రితీష్రెడ్డి
కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయని యంత్రాంగం
కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటున్నా పట్టించుకోని వైనం
ప్రభుత్వ భూమిగా ఆర్డీఓ, జేసీ కోర్టులు నిర్ధేశించిన సదరు భూమిపై హైకోర్టు స్టేటస్–కో ఉత్తర్వులిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కోట్లాది రూపాయాలు విలువైన భూములను రెవెన్యూశాఖ దక్కించుకోవాల్సి ఉండగా టీడీపీ ఇన్ఛార్జీ రితేష్రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ అధికార మత్తులో జోగుతున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.3కోట్లు పైబడి పలికే ఆ ప్రభుత్వ గయ్యాలి భూమి రితేష్రెడ్డి ధారాదత్తం చేసేందుకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పోస్టింగ్సు కోసం రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతకు వంతపాడుతూ అండగా నిలుస్తున్నారని విశ్లేషకులు సైతం ఆరోపిస్తున్నారు. కాగా ఈ విషయమై బద్వేల్ ఆర్డీఓ చంద్రమౌళి వివరణ కోరగా తనకు విషయం తెలియదని, బి కోడూరు రెవెన్యూ అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయడంపై సమాలోచనలు చేస్తామని చెప్పుకొచ్చారు.

కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం...

కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం...