
పెళ్లికి పిలవడానికి వచ్చి చోరీ
ఎర్రగుంట్ల : పట్టణంలోని 12వ వార్డులో నివాసం ఉండే మహుబూబీని పెళ్లికి పిలవడానికి వచ్చి ఆమె చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడు కొత్తపల్లి ఖాసీంపీరాను అరెస్టు చేసినట్లు సీఐ నరేష్బాబు తెలిపారు. శనివారం కేసు వివరాలను సీఐ వెల్లడించారు. ఖాజీపేట గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన ఖాసీంపీరా చెడు వ్యసానాలకు లోనై అప్పులు చేశాడు. ఇతను చాలా ఏళ్లుగా మట్కా బెట్టింగ్, అప్పులు అధికంగా చేశాడు. ఎలాగైన తెచ్చిన అప్పులు కట్టడం కోసం అడ్డ దారిలో డబ్బు కోసం ముసలి వారిని టార్గెట్ చేసుకున్నాడు. వారితో పరిచయం చేసుకుంటూ మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి బంగారు వస్తువులు, డబ్బులు లాక్కుని పారిపోతుంటాడని చెప్పారు. ఇలా ఖాసీంపీరాపై పలు కేసులు ఉన్నాయన్నారు. ఈ తరుణంలో ఈ నెల 9వ తేదీన కడప పాత బస్టాండ్ దగ్గర నుంచి ఆటో తీసుకుని వల్లూరు, కమాలపురం, ఎర్రగుంట్లకు వచ్చాడు. యర్రగుంట్ల పట్టణంలోని పోలీస్స్టేషన్ వెనుక ఉన్న మహుబూబీ అనే వృద్ధురాలి వద్దకు వెళ్లి నిద్రలేపాడు. నేను మీ కోడలి బంధువు అని నమ్మించాడు. మా పాపాకు పెళ్లి చేస్తున్నాం.. అందరూ పెళ్లికి రావాలన్నాడు. పెళ్లికి కూతురికి మీ చేతికి ఉన్న ఉంగరంను అదే సైజులో చేయించాలి. మీ ఉంగరం ఇస్తే బయట ఆటోలు కూర్చోని ఉన్న వారికి చూపించి వస్తాను అని చెప్పాడు. దీంతో మహుబూబీ నమ్మి చేతికి ఉన్న బంగారు ఉంగరం తీసి ఇచ్చింది. ఆ ఉంగరం తీసుకొని ఖాసీంపీరా అక్కడ నుంచి ఊడాయించాడు. దీంతో బాధితురాలు మహూబూబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఖాసీంపీరాను ఎర్రగుంట్లలో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.