పులివెందుల: చంద్రబాబుకు అనైతిక రాజకీయాలు చేయడం అలవాటేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ మాట్లాడారు. ఎన్నికలప్పుడు అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత బుట్టదాఖలు చేయడం ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. ప్రజలు కూడా చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయామని పునరాలోచించుకుంటున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలకు జగనన్న శ్రీకారం చుడితే.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేట్పరం చేయాలని చూస్తుండటం దారుణమన్నారు. అలాగే రైతన్నలకు అదిగో, ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను జగన్మోహన్రెడ్డి ఎండగడతారనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నుంచి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి