సింహాద్రిపురం : పక్షులను ప్రేమించే వారు ఎక్కువగా పావురాలను పోషిస్తుంటారు. పక్షుల ప్రేమికులను ప్రోత్సహించడానికి కొందరు పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన పావురాల పోటీల్లో వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురానికి చెందిన శివప్రసాద్రెడ్డి పావురం ప్రథమ స్థానంలో నిలిచి భళా అనిపించింది. ఏపీ హోమింగ్ పిగియన్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ఈ ఏడాది మధ్యప్రదేశ్లోని భోపాల్ డివిజన్లో గత నెల 22న పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో 159 పావురాలు పాల్గొనగా, ఇందులో శివ ప్రసాద్ రెడ్డి పావురం స్టేట్ లాంగ్ డిస్టెన్స్ చాంపియన్గా నిలిచింది. 700 కిలోమీటర్ల రేస్లో, ఆకాశ మార్గాన 1000 కి.మీ రేస్లోనూ మొదటి స్థానంలో నిలించింది. పావురం యజమాని శివ ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ నేను 200 పావురాలను పెంచి పోషిస్తూ ఉన్నాను. వాటిలో ఈ పావురం చురుకుగా ఉంటుండడంతో భోపాల్కు పంపానని, అక్కడ స్టేట్ చాంపియన్గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పక్షులపై జాలి, ఆదరణ చూపితే అవి యజమానిని అంటిపెట్టుకొని ఉంటాయన్నారు.