జ్యోతిక్షేత్రంపై ఉక్కుపాదం మోపడం అన్యాయం | - | Sakshi
Sakshi News home page

జ్యోతిక్షేత్రంపై ఉక్కుపాదం మోపడం అన్యాయం

Mar 15 2025 12:44 AM | Updated on Mar 15 2025 12:44 AM

జ్యోతిక్షేత్రంపై ఉక్కుపాదం మోపడం అన్యాయం

జ్యోతిక్షేత్రంపై ఉక్కుపాదం మోపడం అన్యాయం

కలసపాడు : ఎందరో అభాగ్యులు, అనాథలకు ఆశ్రయమిస్తూ ఆకలి తీరుస్తున్న వైఎస్సార్‌ జిల్లాలోని జ్యోతి క్షేత్రంపై ఉక్కుపాదం మోపడం అన్యాయమని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి.రమణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతంలోని వేలాది అభాగ్యులకు ఆపన్నహస్తంగా మారిన ఆశ్రమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సరికాదన్నారు. జ్యోతి క్షేత్రాన్ని ఒక అనాథల నిలయంగా, సామాజికసేవా ఆలయంగా, అభాగ్యుల పాలిట ఆపన్నహస్తంగా చూసి అనుమతులు ఇవ్వాలన్నారు. అటవీ అధికారులు కూలగొట్టిన భవనాలను నిర్మించడమేగాక, ఆలయ నిర్మాణానికి అనుమతులు ఇప్పించి ప్రభుత్వ పెద్దలు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా ఏ క్షేత్రంపై లేని వివక్ష జ్యోతిక్షేత్రంపై మాత్రమే ఎందుకు చూపుతుందో అర్థం కావడం లేదన్నారు.

భార్యా, పిల్లలను నిర్భంధించారు

– కడప వాసి ఆవేదన

కడప అర్బన్‌ : తన భార్య, పిల్లలను బాకీ డబ్బుల కోసం నిర్భంధించారని రాంబాబు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. వేంపల్లికి చెందిన రాంబాబు కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్‌ను కలిసేందుకు వచ్చారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో విలేకరులతో రాంబాబు మాట్లాడుతూ చక్రాయపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి నుంచి తన భార్య గంగాదేవి రూ.45లక్షలు రూ.2కు వడ్డీకి తెచ్చి కార్పొరేషన్‌కు బదలాయించి వడ్డీలకు ఇచ్చిందన్నారు. అనంతరం ఆ డబ్బు చెల్లించలేదంటూ వారు తన భార్య, పిల్లలను తీసుకెళ్లి చక్రాయపేట వాసులు వారి ఇంటి వద్ద పెట్టుకున్నారన్నారు. వెంటనే తన భార్య, పిల్లలను తనకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై వేంపల్లి, చక్రాయపేట పోలీసులకు ఇప్పటికే తెలిసినా పట్టించుకోలేదని సమాచారం.

చిలంకూరు పరీక్ష కేంద్రం తొలగింపు

ఎర్రగుంట్ల : మండలంలోని చిలంకూరు జెడ్పీ పాఠశాలలో పది పరీక్ష కేంద్రాన్ని ఈ ఏడాది తొలగించారు. గతంలో చిలంకూరులో పరీక్ష కేంద్రం ఉండడంతో ఆర్టీపీపీలోని డీఏవీ, సరస్వతి స్కూల్స్‌, చిలంకూరులోని జేడ్పీ హైస్కూల్‌ విద్యార్థులంతా పరీక్ష రాసేందుకు అనుకూలంగా ఉండేది. కూటమి ప్రభుత్వం రాగాననే చిలంకూరు పరీక్ష కేంద్రాన్ని తొలగించి యర్రగుంట్లకు మార్చివేశారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల విద్యాఽధికారి శివప్రసాద్‌ వివరణ కోరగా చిలంకూరులో సీ.కేంద్రం కావడంతో ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.

ఆలయంలో మైక్‌ సెట్‌ చోరీ

మదనపల్లె : ఆలయంలో మైక్‌ సెట్‌ చోరీకి గురైన సంఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. అంకిశెట్టిపల్లె పంచాయతీ గాంధీపురంలోని కోదండరామస్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయానికి అమర్చిన మైక్‌ సెట్‌ను ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు చోరీ ఘటనపై టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైక్‌ సెట్‌ విలువ సుమారు రూ.11వేలు ఉంటుందని పేర్కొన్నారు. తాలూకా సీఐ కళావెంకటరమణ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.

టిప్పర్‌ డ్రైవర్‌పై దాడి

మదనపల్లె : రాయచోటి నుంచి మదనపల్లెకు ఇసుక తీసుకుని వచ్చినందుకు టిప్పర్‌ డ్రైవర్‌పై మదనపల్లె టిప్పర్‌ అసోసియేషన్‌ సభ్యులు దాడి చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. రాయచోటికి చెందిన సుబ్రహ్మణ్యం టిప్పర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాజంపేట రీచ్‌ నుంచి ఇసుక లోడ్‌ చేసుకుని, మదనపల్లెలో అన్‌లోడ్‌ చేసి తిరిగి రాయచోటికి వెళుతున్నాడు. చౌడేశ్వరి సర్కిల్‌ వద్ద అసోసియేషన్‌ సభ్యులు బిల్డప్‌ భరత్‌, పీఎస్‌ఆర్‌.ప్రసాద్‌రెడ్డి, అంకిశెట్టిపల్లె రమేష్‌, మణి, గొల్లపల్లెశివ, ముబారక్‌బాషా, ఏఎన్‌ఎస్‌ అమర తదితరులు బండిని అడ్డుకుని తాళాలు లాక్కోవడమే గాక, తనపై దాడిచేసి, చొక్కాను చించివేసి గాయపరిచారన్నారు. మదనపల్లెలో టిప్పర్‌ అసోసియేషన్‌ లారీలు తప్ప వేరెవ్వరూ తక్కువ ధరకు ఇసుక అమ్మరాదని, తాము రూ.24 వేలు అమ్ముతుంటే, నీవు రూ.18,500కు ఎలా దించుతావంటూ గదమాయిస్తూ విచక్షణారహితంగా కొట్టారన్నాడు. బాధితుడు టిప్పర్‌ను అక్కడే విడిచిపెట్టి, తెలిసిన వారి సహాయంతో టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని, సీఐ రామచంద్రకు ఫిర్యాదు చేశాడు. దాడి ఘటనపై విచారణ చేసి కేసు నమోదుచేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement