
బైకు అదుపుతప్పి ఒకరి మృతి
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని మూలవంక గ్రామం నుంచి కొత్తపేటకు వెళ్లే రోడ్డుపై గురువారం మధ్యాహ్నం బైకుకు కుక్క అడ్డు రావడంతో బైకు అదుపుతప్పి రోడ్డు పక్కగా ఉన్న మోరీని ఢీకొనడంతో గగ్గుటూరు రాజా(55) మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మహేశ్వరరెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు గగ్గుటూరు రాజా స్థానిక లింగారెడ్డిపల్లె నివాసి కాగా, వృత్తి రీత్యా వ్యవసాయ పనులు, బేల్దారిమేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బైకు నడుపుతూ తలకు తీవ్ర గాయాలైన మహేశ్వరరెడ్డిని చికిత్స కోసం కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఇతను కూడా స్థానిక లింగారెడ్డిపల్లెకు చెందిన వ్యక్తి కాగా, వ్యవసాయ పనులు, ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నారు.
జిల్లా ఆస్పత్రిలో దొంగ హల్చల్
– మహిళా డాక్టర్ మెడలో బంగారు గొలుసు లాగేందుకు
ప్రయత్నించిన దొంగ
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ దొంగ ఏకంగా మహిళా డాక్టర్ మెడలోని బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించాడు. అయితే మహిళా డాక్టర్ అప్రమత్తం కావడంతో దొంగ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఘటన గురువారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో జరిగింది. గైనకాలజిస్ట్ శ్రీవాణి ఆపరేషన్ థియేటర్కు బయల్దేరారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి డాక్టర్ మెడలోని బంగారు చైన్ను లాగేందుకు ప్రయత్నించాడు. దీంతో డాక్టర్ అతని చేయి పట్టుకుని విసిరేశారు. తర్వాత డాక్టర్ గట్టిగా కేకలు వేయడంతో దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్బాబు దృష్టికి తీసుకెళ్లారు. సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్కే ఆస్పత్రిలో సెక్యూరిటీ లేదని పలువురు వాపోతున్నారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి
రాజుపాళెం : మండల కేంద్రమైన రాజుపాళెంలో వెంగలాయపల్లె గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రాజుపాళెం ఎస్ఐ కత్తి వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు గాదెగూడూరు గ్రామానికి చెందిన సుంకు ప్రసాద్(55) పని నిమిత్తం ప్రొద్దుటూరు వెళుతున్నారు. ఇదే మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన కాసా వెంకటసుబ్బా రెడ్డి ద్విచక్ర వాహనంలో ప్రొద్దుటూరు వైపు నుంచి వెంగలాయపల్లె గ్రామానికి వెళుతూ అతివేగం, అజాగ్రత్తగా పెట్రోల్ బంకు వైపునకు ద్విచక్ర వాహనాన్ని తిప్పడంతో ఈ సంఘటన జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో సుంకు ప్రసాద్ కింద పడిపోయాడు. అతన్ని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య సుంకు మల్లేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు, గోడౌన్లలో
పోలీసుల తనిఖీలు
కడప అర్బన్ : జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ ఆదేశాల మేరకు కడప నగరంలోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు, గోడౌన్లలో గురువారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలను పూర్తిగా కట్టడి చేసే క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు రవాణా జరగకుండా జిల్లా ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, మేకలదొడ్డి, తదితర ప్రాంతాల్లోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు, గోడౌన్లు, ప్రముఖ ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీల గోడౌన్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణాకు పాల్పడినా, సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్శిళ్లలో ఎక్కడైనా గంజాయి ఆనవాళ్లను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీలలో ఫ్యాక్షన్ జోన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, ఎస్ఐ మల్లికార్జున రెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

బైకు అదుపుతప్పి ఒకరి మృతి

బైకు అదుపుతప్పి ఒకరి మృతి

బైకు అదుపుతప్పి ఒకరి మృతి