సాక్షి ప్రతినిధి, కడప: లక్షలాదిమంది భక్తుల మనో భావాలపై దెబ్బకొట్టారు. కోట్లాది మంది అన్నార్థులకు శరణార్థిగా ఉన్న ఆశ్రమంపై పగబట్టారు. దశాబ్దాల తరబడి ఉన్న భవనాలను టైగర్ ఫారెస్టు జోన్ అంటూ కూలగొట్టారు. సనాతన ధర్మానికి ప్రతినిధినంటూ కాషాయధారిగా అవతారమెత్తిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ నిర్వహిస్తున్న అటవీశాఖ నేతృత్వంలోనే కూలగొట్టే చర్యలు చేపట్టారు. కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వ పెద్దల కళ్లు తెరుచుకు నేలా వైఎస్సార్సీపీ నినదించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ గళమెత్తింది. క్రమం తప్పకుండా పోరుబాట పట్టడంతో రాజకీయ దుమారం చెలరేగింది. వెరశి ప్రభుత్వ పెద్దలు దిగివచ్చారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన జ్యోతిక్షేత్రంలో కట్టడాలు కూలగొట్టడంపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జ్యోతిక్షేత్రాన్ని దేవదాయశాఖ పరిధిలోకి విలీనం చేసుకునేందుకు ప్రతిపాదనలున్నాయని అసెంబ్లీలో బుధవారం ప్రకటించారు.
● జ్యోతి క్షేత్రంలో పురాతన శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉంది. కాశిరెడ్డినాయన అనే సిద్ధుడు బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనతో దేశాటన చేస్తూ పుణ్యక్షేత్రాల్లో గడిపారు. యోగులు, సిద్ధుల వద్ద దీక్షలు తీసుకున్నారు. పాడుపడిన దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమన్న గురువు ఆదేశాల ప్రకారం జ్యోతి క్షేత్రంలో నరసింహాస్వామి దేవాలయాన్ని 1980 దశకంలో పునర్నిర్మాణం చేశారు. అక్కడే నిత్యం వందలాది మందికి అన్నదానం సైతం చేసేందుకు ఆశ్రమం కూడా కట్టారు. కాశినాయన 1995లో పరమపదించాక జ్యోతిక్షేత్రం..కాశినాయన క్షేత్రం అయింది. ఆంధ్రా, తెలంగాణాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఈ క్షేత్రానికి ఏటా వార్షికోత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అలాంటి క్షేత్రంలో భక్తుల కోసం, వంట కోసం సత్రాలు నిర్మాణాలు చేపట్టారు. కొన్ని దశాబ్దాలుగా ఈక్షేత్రం అటవీ ప్రాంతంలోనే ఉంది. అక్కడి నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట కూడా ఉంది. ఇన్నాళ్లుగా అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అడ్డం వచ్చింది. ప్రధాన దేవాలయం, కాశినాయిన సమాధి మినహా తక్కిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేశారు.
కట్టడాల పరిరక్షణకు అండగా వైఎస్సార్సీపీ...
జ్యోతి క్షేత్రం శ్రీశైలం టైగర్జోన్ రిజర్వ్ ఫారెస్టులో ఉంది. గతంలో అటవీశాఖ అధికారులు అక్కడి నిర్మాణాలపై అభ్యంతరాలు తెలిపినా కూల్చివేత వరకు వెళ్లలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న 13 హెక్టార్ల భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని అప్పటి కేంద్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్కు స్వయంగా లేఖ కూడా రాశారు. రోజు రోజుకీ భక్తులు పెరగడంతో అక్కడ నిర్మాణాలు అవసరం ఏర్పడిందని, మరో వైపు అసలు అటవీ సంరక్షణ చట్టం రాకముందు నుంచే ఇక్కడ దేవాలయాలు ఉన్నాయని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి తనవంతు కర్తవ్యం నిర్వర్తించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సైతం పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి ఇదే సమస్యను తీసుకెళ్లారు. కాశినాయన క్షేత్రం ప్రాశ స్త్యం దెబ్బతినకుండా ఉండాలని, భక్తులకు సౌకర్యాలు ఉండేందుకు కృషి చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం మాత్రం వెనుకా ముందు చూడకుండా, భక్తుల మనోభావాలను గుర్తించకుండా కూల్చివేతలు చేపట్టింది. నిత్యం తాను సనాతనవాదిని అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రాతినిధ్యం వహించే అటవీశాఖ అధికారులే ఈ కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. ఎన్నో దేవాలయాలు శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ అడ్డురాని అటవీ చట్టం ఇక్కడే ఎందుకు అడ్డుగా ఉందని భక్తులు నిలదీశారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని ప్రకటించిన పవన్కల్యాణ్ నేతృత్వంలోని మంత్రిత్వశాఖ కాశినాయన కట్టడాలు కూల్చివేతలు చేస్తుంటే ఆయనేం సమాధానం చెబుతారని వైఎస్సార్సీపీ నిలదీసింది.
రాజకీయ దుమారం రేగడంతో...
ఆశ్రమాన్ని ప్రభుత్వమే నిర్వహించండి. కట్టడాలను అటవీశాఖకు వాడుకోండి. కూల్చివేతలు చేపట్టవద్దని భక్తులు, పీఠాధిపతులు నెత్తి నోరు కొట్టుకున్నా కూటమి సర్కార్ కాశినాయన క్షేత్రంలో నిర్మాణాలు కూల్చింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై వైఎస్సార్సీపీ పోరుబాట ఎంచుకుంది. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, అధికార ప్రతినిధి శ్యామల కాశినాయన క్షేత్రాన్ని క్రమం తప్పకుండా సందర్శించారు. గురువారం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సైతం కాశినాయన క్షేత్రం వెళ్లనున్నారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రజల చెంతకు వైఎస్సార్సీపీ తీసుకెళ్లింది. నిర్మాణాలు పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ, లక్షలాది మంది భక్తుల మనోభావాలపై దెబ్బ కొట్టడాన్ని ఎత్తిచూపారు. వైఎస్సార్సీపీ ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా హిందు సంఘాలు, పలువురు పీఠాధిపతులు కాశినాయన క్షేత్రంలో కట్టడాలు కూలగొట్టడంపై నిరశన గళం విప్పారు. వెరశి రాజకీయ దుమారం రేగింది. బీజేపీ సైతం అసెంబ్లీలో స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమేరకు ప్రభుత్వ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కాశినాయన క్షేత్రంలో కట్టడాలు కూల్చివేతలపై మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెబుతూ ఎక్స్లో స్పందించారు. దేవదాయశాఖ పరిధిలోకి చేర్చుకునేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం అసెంబ్లీలో ప్రకటించాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాశినాయన కట్టడాలు కూల్చివేతపై క్షమాపణలు చెప్పిన మంత్రి నారాలోకేష్
దేవదాయశాఖ పరిధిలోకి కాశినాయన జ్యోతి క్షేత్రం ప్రతిపాదనలు
అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి