
సూపర్సిక్స్ అమలు ఎప్పుడు?
ప్రొద్దుటూరు: అధికారంలోకి వస్తూనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు ఆచరణ పెట్టలేకపోయారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు పూర్తయిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.37 వేల కోట్లు అవుతుందన్నారు. 40 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని అమలు చేయలేదన్నారు. రైతులకు కూడా పంట సాయం అందలేదని, 50 ఏళ్లకే పింఛన్ మాట దేవుడికెరుక అంటూ ఎద్దేవా చేశారు. 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉందని, బీసీ సబ్ ప్లాన్ ఊసే లేదని ఆరోపించారు. మున్ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి కష్టాలు వస్తాయో చూడాల్సి ఉందన్నారు. విద్యుత్ చార్జీలను పెంచబోమని ఊరూరా ప్రచారం చేసిన చంద్రబాబు ఇపుడు ఎందుకు పెంచారో చెప్పాలన్నారు. టీడీపీ నేతలు ఇసుక తవ్వి నదులను మాయం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి