కడపకు.. కొత్త సొబగులు | - | Sakshi
Sakshi News home page

కడపకు.. కొత్త సొబగులు

Oct 20 2023 2:16 AM | Updated on Oct 20 2023 1:56 PM

కడప గడప దేవాలయం నమూనాతో మాసాపేట వద్ద ఏర్పాటు చేయనున్న జంక్షన్‌ నమూనా చిత్రం - Sakshi

కడప గడప దేవాలయం నమూనాతో మాసాపేట వద్ద ఏర్పాటు చేయనున్న జంక్షన్‌ నమూనా చిత్రం

కడప నగరం సరికొత్త హంగులను రూపుదిద్దుకుంటోంది. నగర రూపురేఖలు మారిపోయి కొత్త సొబగులను అద్దుకుంటోంది. పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని చెబుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కడప నగరాభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. నగర రూపురేఖలు మార్చి ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపడుతున్నారు.

కడప సిటీ: కడప నగర రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రధానంగా కడపలో పాత జంక్షన్లు పోయి కొత్త జంక్షన్లు రూపుదిద్దుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లోని 12 జంక్షన్లను సుందరంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించడమేగాక, అభివృద్ధి పనులకు నగర పాలక సంస్థ రూ.120 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే రహదారులు, భవనాలు, నగర పాలక సంస్థ పనులు చేపట్టాయి. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో రోడ్ల అభివృద్ధికి నిధులు వెచ్చించి రూపురేఖలు మార్చారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం సహకరించకపోవడంతో నగరాభివృద్ధి కుంటుపడింది.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే పుట్టిన గడ్డ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. కడప నగరాభివృద్ధిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ.అంజద్‌ బాషా, ఎంపీ వైఎస్‌.అవినాష్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు విశేష కృషి చేస్తున్నారు. పనులకు సంబంధించి వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. సీఎం ఆదేశాలతో కడప మున్సిపల్‌ కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రత్యేక డ్రైవ్‌ పేరిట ప్రతి మంగళవారం కాలినడకన తిరిగి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.

తీరనున్న ట్రాఫిక్‌ సమస్య
ప్రస్తుతం కడపలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమైంది. వాహనాల సంఖ్య పెరగడంతో రద్దీ పెరుగుతోంది. తరచూ ట్రాఫిక్‌ స్తంభించడంతోపాటు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సరైన ప్రదేశాల్లో జంక్షన్లు లేక వాహనదారులు తికమక పడిపోతున్నారు. అవగాహన లేక వాహనాలు నడపడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో రూ.120 కోట్లతో జంక్షన్ల ఏర్పాటుకు నగరపాలక సంస్థ ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించింది.కడప నగర పాలక సంస్థ పలు ప్రాంతాల్లో పాత జంక్షన్లను ఆధునీకరిస్తూనే అవసరమున్న చోట కొత్త జంక్షన్లు నిర్మిస్తోంది. దీంతో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభించనుంది. మత సామరస్యానికి ప్రతీకగా ఇక్కడ చిహ్నాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ పూర్తయితే కడప నగర కొత్త శోభ సంతరించుకోనుంది.

నగరంలో జంక్షన్లు ఇవీ..
► అంబేడ్కర్‌ జంక్షన్‌ పేరుతో ఆర్టీసీ బస్టాండు వద్ద సర్కిల్‌ను రూ.90 లక్షలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అక్కడ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.

► ఆర్టీసీ బస్టాండు నుంచి అప్సరరోడ్డు, పాత తిరుపతి బైపాస్‌ రోడ్డు కలిసే చోట వై.జంక్షన్‌ వద్ద రూ.70 లక్షలతో మెరుగులు దిద్దుతున్నారు. అశోక చక్రం చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నారు.

► నగర నడిబొడ్డున అల్మాస్‌పేట వద్ద పాత జంక్షన్‌ను రూ.41లక్షలతో ఆధునీకరిస్తున్నారు. ఈ సర్కిల్‌లో దర్గా చిహ్నాన్ని ఏర్పాటుచేస్తున్నారు.

► దేవుని కడపకు వెళ్లే దారిలోని పాత జంక్షన్‌ను.. మాసాపేట జంక్షన్‌గా మార్చేందుకు రూ.41 లక్షలతో పనులు చేపట్టారు. దేవుని కడప ఆలయ గోపురాన్ని ఏర్పాటుచేస్తున్నారు.

► దేవునికడప రోడ్డులో మార్కెట్‌యార్డు వద్ద రూ.48 లక్షలతో జంక్షన్‌ నిర్మిస్తున్నారు. ఎద్దుల బండి చిహ్నం నిర్మించేందుకు చర్యలు చేపట్టారు.

► నగరంలోని మాచుపల్లె బస్టాండు వద్ద రూ.72 లక్షలతో జంక్షన్‌ ఏర్పాటుచేస్తున్నారు. చిన్న పార్కు లాగా నిర్మాణం చేపట్టి ఆహ్లాదకర వాతావరణం కల్పించనున్నారు.

►కృష్ణా థియేటర్‌ వద్ద కోటి రూపాయల నిధులతో కృష్ణా జంక్షన్‌ నిర్మిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని చిహ్నంగా ఏర్పాటుచేస్తున్నారు.

► నగరంలోని దిశ పోలీస్‌స్టేషన్‌ వద్ద పాత వన్‌టౌన్‌ సర్కిల్‌ను గాంధీ జంక్షన్‌గా తీర్చిదిద్దుతున్నారు. రూ.1.98 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక్కడ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.

► మున్సిపల్‌ మెయిన్‌ స్కూల్‌ వద్ద కోటి రూపాయల నిధులతో అన్నమయ్య జంక్షన్‌ నిర్మిస్తున్నారు. తాళపత్ర గ్రంథాలతో 12 అడుగుల అన్నమయ్య విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.

► నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్‌ను గోకుల్‌ జంక్షన్‌గా రూ.55 లక్షలతో ఆధునీకరిస్తున్నారు. ఇక్కడ పది అడుగుల పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

► నగరంలోని కోటిరెడ్డి జంక్షన్‌ను సుందరీకరిస్తున్నారు. కొత్తగా కోటిరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

► ఏడురోడ్ల జంక్షన్‌లో ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటుంది. అవసరం మేరకు జంక్షన్‌ నిర్మించి సమస్య పరిష్కరించ నున్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement