యాదగిరిగుట్ట రూరల్ : హైదరాబాద్కు చెందిన 12 ఏళ్ల కూచిపూడి నర్తకి పి.వైష్ణోదేవి యాదగిరీశుడి కొండ చుట్టూ కూచిపూడి నృత్యం చేస్తూ గిరి ప్రదక్షిణ చేసింది. సంస్కృతి, ఆధ్యాత్మికతను సమ్మిళితం చేస్తూ, 3 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ మార్గమంతా నృత్యం చేస్తూ భక్తులను ఆకట్టుకుంది. కాగా జ్యోతి కళాక్షేత్రం స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో వైష్ణోదేవి ఈ ప్రదర్శన ఇచ్చారు. ఆమెను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఆలయ ఈఓ భవానీ శంకర్ అభినందించారు.
లక్ష్మీనరసింహుడికి
నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామికి, గోదాదేవికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆలయంలో స్వామి అమ్మవార్ల కల్యాణం అనంతరం తిరుమాడ వీధులలో స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగింపు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.
సౌకర్యాల కల్పనలో
ప్రభుత్వం విఫలం
రామన్నపేట : ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ విమర్శించారు. ఆదివారం రామన్నపేటలో చేపట్టిన ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామన్నపేట సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం వెంటనే రూ.20 కోట్లు మంజూరు చేయాలన్నారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. ప్రజలకు ఇబ్బందిగా మారిన కుక్కలు, పందుల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, కందుల హన్మంత్, గొరిగె సోములు, బావండ్లపల్లి బాలరాజు, మునుకుంట్ల లెనిన్, పల్లె సత్యం, బాబుచారి, వేముల మల్లేశం, బండ శ్రీశైలం, కుందూరు వెంకటేశం, మునుకుంట్ల రాణి, రాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


