భువనగిరి : జిల్లాలో 28 కేంద్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం గణితం–2బీ, జువాలజీ, హిస్టరీ పేపర్–2 పరీక్షలు జరిగాయి. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 4,888 మంది విద్యార్థులకు 4,747 మంది హాజరు కాగా 141 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీ
చేసిన అదనపు కలెక్టర్
భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీవైష్ణవి జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ భాస్కర్రావు శుక్రవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. కేంద్రాల్లో కల్పించిన వసతులను అడిగి తెలుసుకున్నారు.
నిత్యాన్నదానానికి విరాళం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అందజేస్తున్న నిత్యన్నదాన పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వేటపాలెం గ్రామానికి చెందిన అమటం శైలేంద్రనాథ్, పద్మావతి, షణ్ముక మయూర్లు రూ.లక్ష విరాళం అందజేశారు. శుక్రవారం శ్రీస్వామి వారిని దర్శించుకున్న సందర్భంగా వారు ఆలయాధికారి గజివెల్లి రఘుకు విరాళంగా ఇచ్చారు. భక్తుల అన్న ప్రసాదం కోసం విరాళం వినియోగించాలని వారు కోరారు.
మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు
భువనగిరిటౌన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భువనగిరి కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులకు చెస్, స్పూన్, క్యారమ్స్, రిగ్బాల్ తదితర క్రీడా పోటీలు కొనసాగాయి. ఈ పోటీలకు ఈ సారి అంగన్వాడీ టీచర్లను ఆహ్వానించకపోవడంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
రేపటి నుంచి
‘ఇంటింటికీ సీపీఎం’
భువనగిరిటౌన్ : ప్రజా సమస్యల అధ్యయనం కోసం ఈ నెల 8 నుంచి 31వ తేదీ వరకు ఇంటింటికీ సీపీఎం కార్యక్రమం చేపట్టనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి జహంగీర్ తెలిపారు. శుక్రవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. వీటి పరిష్కారంపై ఎమ్మెల్యేలు, ఎంపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలేరు రెవెన్యూ డివిజన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు బొలగాని జయరాములు పాల్గొన్నారు.


