యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి యాదగిరీశుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ మాడవీధులతో పాటుగా, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, ప్రధానాలయం క్యూలైన్లు వంటి ప్రాంతాల్లో భక్తజనం సందోహం కనిపించింది. శ్రీస్వామి వారి దర్శనానికి 3 గంటల సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 35 వేలమందికి పైగా భక్తులు దర్శించుకోగా, వివిధ విభాగాల ద్వారా స్వామి వారికి రూ.45,46811 నిత్యాదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.


