
నేడే దీపావళి పండుగ
రామగిరి(నల్లగొండ): దీపావళి పండుగను సోమవారమే జరుపుకోవాలని నిర్ణయించినట్లు అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా వేణుగోపాలరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న నరకచతుర్ధశి నివాళులు, 21న ధనలక్ష్మి పూజలు జరుపుకోవాలని ఆయన అన్నారు. అమావాస్య ఘడియలు సోమవారం మధ్యాహ్నం 3.46 నుంచి మంగళవారం సాయంత్రం 5.56 నిమిషాల వరకు ఉన్నందున నోములు సోమవారం, మంగళవారం రెండు రోజులు జరుపుకోవచ్చని సూచించారు. ఈసారి కొత్త నోములు లేవని పాత వారు కేదారిశ్వరి వ్రతం చేసుకోవాలన్నారు. సోమవారం నివాళులు ఇచ్చుకోవాలని పేర్కొన్నారు.
సాగర్లో ముగిసిన ఏపీ గవర్నర్ పర్యటన
నాగార్జునసాగర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల నాగార్జునసాగర్ పర్యటన ఆదివారం ముగిసింది. శనివారం కుటుంబ సమేతంగా నాగార్జునసాగర్కు వచ్చిన ఏపీ గవర్నర్ నాగార్జున కొండ మ్యూజియాన్ని సందర్శించి.. రాత్రి విజయ విహార్ అతిధి గృహంలో బస చేశారు. ఆదివారం నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని, డ్యాం, బుద్ధవనం సందర్శించారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి ఏపీకి వెళ్లిపోయారు. ఆయనకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వీడ్కోలు పలికారు. అంతకుముందు టూరిజం, రెవెన్యూ అధికారులతో ఫొటోలు దిగి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎస్పీ రాజశేఖరరాజు, తహసీల్దార్లు శాంతిలాల్, అనిల్కుమార్, రఘు, కృష్ణయ్య, డ్యాం ఎస్ఈ మల్లికార్జునరావు, ఈఈ సీతారాం, జిల్లా టూరిజం అధికారి శివాజీ, భానుప్రసాద్, కృష్ణకుమారి, రవి, శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
భువనగిరి: భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలోగల మినీ శిల్పారామంలో ఆదివారం శ్రీచంద్ర కళా నిలయం ఆధ్వర్యంలో పెరుమాండ్ల షంతోష్ శిష్య బృందం ఆంధ్ర నాట్య కళా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. సెలవు దినం కావడంతో శిల్పారామానికి వచ్చిన సందర్శకులు నృత్య ప్రదర్శనను తిలకించి ఆనందించారు. ఈ నృత్య ప్రదర్శనలో కళాకారులు వష్తిక, సుహని, రితిక, నిత్యశ్రీ, అశ్రిత, దీక్షిత, అక్షిత పాల్గొన్నారు.

నేడే దీపావళి పండుగ