
దొంగల ముఠా అరెస్ట్
నల్లగొండ: తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను నల్లగొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్కు చెందిన బాలెం రాజేష్, హైదరాబాద్లోని బాలాపూర్ చౌరస్తాకు దస్తర్ బండి షఫీ గతంలో హైదరాబాద్లో బైక్లు చోరీ చేసిన కేసుల్లో చర్లపల్లి జైలుకు వెళ్లి వచ్చారు. కట్టంగూర్ మండలం ఎరసానిగూడేనికి చెందిన ఉబ్బని యోగేశ్వర్ అలియాస్ యోగి రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో నివాసముంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో యోగేశ్వర్కు బాలెం రాజేష్, దస్తర్ బండి షఫీ పరిచయమయ్యారు. వీరంతా మద్యానికి బానిసై, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రివేళ చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. యోగేశ్వర్ తన స్నేహితుడైన నల్లగొండ పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన వల్లూరి యువరాజ్ చంద్రతో పాటు సాయికుమార్, శ్రీకాంత్కు విషయం చెప్పాడు. వీరితో పాటు గతంలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తలారి మనోజ్ కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు చేయడం ప్రారంభించారు. వీరు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 4, నల్లగొండ జిల్లాలో 14 చోరీలకు పాల్పడ్డారు. మంగళవారం సాయంత్రం నల్లగొండ బస్టాండ్ ఎదురుగా ఉన్న సవేరా లాడ్జిలో వీరు ఉన్నట్లు పక్కా సమాచారంతో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ టూటౌన్ ఎస్ఐ సైదులు తన సిబ్బందితో కలిసి లాడ్జిపై దాడి చేసి బాలెం రాజేష్, దస్తర్ బండి షఫీ, ఉబ్బని యోగేశ్వర్, తలారి రాజేష్ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు, ఒక కేజీ 800 గ్రాముల వెండి ఆభరణాలు, వెండి చెంబు, ప్లేట్, బైక్, రెండు ల్యాప్టాప్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సాయికుమార్, శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న టూ టౌన్ సీఐ రాఘవరావు ఎస్ఐ సైదులు, నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు, హెడ్్ కానిస్టేబుల్ పాయిలి రాజు, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు.
ఫ బంగారు, వెండి ఆభరణాలు, బైక్,
రెండు ల్యాప్టాప్లు, నాలుగు
సెల్ఫోన్లు స్వాధీనం
ఫ వివరాలు వెల్లడించిన
నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్

దొంగల ముఠా అరెస్ట్