
కుంగిన నేల.. పగిలిన పైపులు
గురువారం వరకు పనులు పూర్తిచేస్తాం
కొత్త పైప్లైన్ నిర్మాణ పనులను గురువారం వరకు పూర్తిచేసి నీటి సరఫరాను యథావిఽధిగా పునరుద్ధరిస్తాం. పనులు చేసే ముందు తమకు ముందస్తు సమాచారం ఇవ్వడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్అండ్బీ అధికారులకు సూచిస్తాం.
– శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, ఆలేరు
ఆలేరు: ఆలేరు పట్టణంలో ఆర్యూబీ పనులను కాంట్రాక్టర్ ఇష్టారీతిగా చేస్తున్నారు. దాదాపు రూ.12కోట్లతో చేపట్టిన ఈ పనులపై ఆర్అండ్బీ అధికారులు చుట్టపుచూపుగా వస్తూ పరిశీలిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఆర్యూబీ పనుల్లో భాగంగా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. ఇందు కోసం జేసీబీ యంత్రాలతో సుమారు 20 అడుగులకుపైగా తవ్వకాలు చేపట్టారు. ఈ పనులు జరుగుతుండగా రెండు రోజుల క్రితం మిషన్ భగీరథ, మున్సిపల్ తాగునీటి సరఫరా పైప్లైన్లు పగిలిపోయాయి. వివేకానంద స్వామి విగ్రహం నుంచి రైల్వేగేట్ చౌరస్తా వరకు రెండు చోట్ల పైప్లైన్లు ధ్వంసమైనట్టు అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు ట్యాంక్ నుంచి నీళ్లు వెళ్లకుండా గేట్ వాల్వ్ను మూసివేసి నీటి వృథాకు అడ్డుకట్టవేశారు. దాంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని లక్ష లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకు నుంచి పట్టణంలోని వివిధ కాలనీలకు వెళ్లే నీటి సరఫరా ఆగిపోయింది. క్రాంతినగర్, ఆర్కేవీ తదతర ప్రాంతాల్లో సుమారు 200 కుటుంబాలకు రెండు రోజులుగా నీటి సరఫరాకు బ్రేక్పడింది. దీంతో మున్సిపల్ సిబ్బంది ఆయా కాలనీలకు రోజుకు 15 ట్యాంకర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తున్నారు. దాదాపు 200 మీటర్ల పొడవు కొత్తగా పైప్లైన్ వేస్తున్నారు.
విద్యుత్ స్తంభంతో పొంచి ఉన్న ప్రమాదం
రైల్వేగేట్ చౌరస్తాలోని వైకుంఠం కిరాణం దుకాణం ముందు ఉన్న 11కేవీ విద్యుత్ స్తంభంతో ప్రమాదం పొంచి ఉంది. ఈ చౌరస్తాలో కిరాణం, చిరు వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు, కూరగాయల దుకాణాలు, జనరల్ స్టోర్లు ఉండడంతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ లోతుగా తవ్వకాలు చేపట్టడం, ఇటీవల రెండు రోజులు వర్షాలు కురవడంతో నేల మొత్తం కుంగిపోయింది. ఇక్కడ ఉన్న విద్యుత్ స్తంభం పక్కకు ఒరుగుతున్నట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల ముందు ఉన్న సిమెంట్ బెడ్లకు పగుళ్లు వచ్చాయి.
కాపర్ తీగ, ఇసుక బస్తాలు ఆపుతాయా?
తవ్వకాలు చేసిన ప్రాంతంలో భూమి మరింత కుంగిపోయి విద్యుత్ స్తంభం పడిపోకుండా ఇసుక బస్తాలను అడ్డుగా పెట్టారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి స్తంభానికి కాపర్ తీగతో మరో ఐరన్ రాడ్కు కట్టారు. కానీ కాపర్ తీగ విద్యుత్ స్తంభం పడిపోకుండా ఆపుతుందా అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతోన్నాయి. నేల కుంగడంతో ఇసుక బస్తాలు ఏ మేరకు ప్రమాదాన్ని నివారించగలదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్థానికు వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.
ఆలేరులో ఇష్టారీతిగా ఆర్యూబీ
రిటైనింగ్ వాల్ పనులు
జేసీబీలతో తవ్వకాలతో
నీటి పైప్లైన్లు ధ్వంసం
పలు కాలనీలకు రెండు
రోజులుగా నిలిచిన నీటి సరఫరా
కూలేస్థితిలో 11కేవీ విద్యుత్ స్తంభం
ఆందోళనలో రైల్వేగేట్ చౌరస్తా
వ్యాపారులు

కుంగిన నేల.. పగిలిన పైపులు