
పరిశోధన.. బోధనలో ఓ భాగం
రామగిరి(నల్లగొండ): పరిశోధన బోధనలో భాగమని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ(నాగార్జున ప్రభుత్వ కళాశాల) స్థాపించి 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మంగళవారం కాలేజీలో వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అధ్యాపకులు బోధనకు పరిమితం కాకుండా పరిశోధనలో నిమగ్నం కావాలని తద్వారా సబంధిత సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుందన్నారు. స్వయం ప్రతిపత్తి కళాశాలలు పరిశోధనకు పెద్దపీట వేయాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల హాజరుశాతం కేవలం 50 శాతమే ఉంటుందని, కనీసం 75 శాతం హాజరుశాతం ఉన్న విద్యార్థులకే ఉపకార వేతనం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని తెలంగాణ కళాశాల విద్య ఉన్నతాధికారులకు సూచించారు. ప్రతి అధ్యాపకుడు విధిగా హాజరు తీసుకోవాలని అన్నారు. రేమీడియల్ క్లాసులు తీసుకొని అధ్యాపకులు విద్యార్థులకు మెంటార్గా ఉండాలన్నారు. ఇతర అతిథులు మాట్లాడుతూ.. కళాశాలలో చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉండడం కళాశాలకు గర్వకారణమని అన్నారు. 70 ఏళ్ల ప్రస్థానంలో ఎంతోమంది విద్యార్థులకు ఉన్నతులుగా తీర్చిదిద్దిన కళాశాలకు తమవంతు సహాయ సహకారాలు అందించాలని పూర్వ విద్యార్థులను కోరారు. ఎన్జీ కళాశాలకు రానున్న కాలంలో న్యాక్–ఎ గ్రేడ్ రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కళాశాల విద్య ఆర్జేడీ డాక్టర్ డీఎస్ఆర్. రాజేంద్రసింగ్ మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ప్రతి ఉద్యోగ ప్రకటనను గమనిస్తూ వాటికి సిద్ధం కావాలని సూచించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతి ఏటా టాపర్గా నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తామన్నారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి కళాశాల పేరు మీద రూ.1.5లక్షలు డిపాజిట్ చేస్తే వారి పేరు మీద లేదా వారు సూచించిన వారి పేరు మీద బంగారు పతకాలు ఇస్తామని తెలిపారు. అనంతరం 2021–2022 నుంచి 2023–24 వరకు వివిధ సబ్జెక్టులలో టాపర్గా నిలిచిన యూజీ, పీజీ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ సీఓఈ డాక్టర్ జి. ఉపేందర్రెడ్డి, తెలంగాణ కళాశాల విద్య రిటైర్డ్ ఆర్జేడీ డాక్టర్ జి. యాదగిరి, ఉమెన్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరాజు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్ రాజారామ్, ఎన్జీ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణప్రసాద్, రిటైర్డ్ అధ్యాపకులు డాక్టర్ లింగయ్య, డాక్టర్ లక్ష్మయ్య, మీనయ్య, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అంతటి శ్రీనివాస్, సీఓఈ బత్తిని నాగరాజు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ వైవీఆర్. ప్రసన్నకుమార్, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వెల్దండి శ్రీధర్, అధ్యాపకులు డాక్టర్ మునిస్వామి, డాక్టర్ ఎ. మల్లేశం, సీహెచ్. సుధాకర్, ఎన్. కోటయ్య, శిరీష, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎంజీయూ వీసీ
ఖాజా అల్తాఫ్ హుస్సేన్
ఘనంగా ఎన్జీ కాలేజీ
వ్యవస్థాపక వేడుకలు
విద్యార్థులకు
గోల్డ్ మెడల్స్ అందజేత