
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: పంచనారసింహులు కొలువైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం చేసి తులసీదళాలతో అర్చించారు. ఇక ప్రాకార మండపంలో సుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం వేడుకను ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు.ముఖమండపంలో అష్టోత్తర పూజలు తదితర కై ంకర్యాలు గావించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వారబంధనం చేశారు.