
చోరీలకు పాల్పడుతున్న ముఠా సభ్యుల అరెస్ట్
● 17 తులాల బంగారం, 79 తులాల వెండి,
2కిలోల గంజాయి,
బైక్ స్వాధీనం
● పరారీలో మరో ఇద్దరు
● వివరాలు వెల్లడించిన
నల్లగొండ జిల్లా ఎస్పీ
శరత్చంద్ర పవార్
నల్లగొండ: గంజాయి సేవిస్తూ జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను ఆదివారం నార్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. హైదరాబాద్లోని నాగోల్ ప్రాంతానికి చెందిన గాజుపల్లి జోసఫ్, బోస్, ఎరిక్ విల్సన్ మెరినా, ఒరిస్సాకు చెందిన మాలిక్తో పాటు మరో ఇద్దరు బాలురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు జల్సాలకు అలవాటు పడి రాత్రివేళ తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. గత నెల 30న నార్కట్పల్లిలోని రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అఽధికారి గాలి యాదయ్య ఇంట్లో చోరీకి పాల్పడి 22 తులాల బంగారం, 80 తులాల వెండి అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఉదయం నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో కలిసి నార్కట్పల్లి శివారులోని ఓ వెంచర్లో ఇద్దరు బాలురతో పాటు ఎరిక్ విల్సన్ మెరినా, గాజుపల్లి జోసఫ్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 17 తులాల బంగారం, 79 తులాల వెండి, 2 కిలోల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు బోస్, మాలిక్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించిన నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ క్రాంతికుమార్, ఏఎస్ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.