
యూనిఫాం.. ఒక జతే సిద్ధం
భువనగిరి : వారం రోజుల్లో బడులు ప్రారంభంకానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే యూనిఫాం అందించాల్సి ఉంది. పాఠశాలల పునఃప్రారంభం రోజునే పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు పాఠశాలలకు యూనిఫాం చేరలేదు. ఒక జత చొప్పున కుట్టడం పూర్తి కాగా.. రెండో జత ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత ఇవ్వడం లేదు.
ఒక్క విద్యార్థికి రెండు జతలు
జిల్లా వ్యాప్తంగా 730 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 484 ప్రాథమిక, 68 ప్రాథమికోన్నత, 163 జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు మోడల్, కేజీబీవీ, యూఆర్ఎస్, టీజీఆర్ఈఎస్, టీయూడబ్ల్యూఎస్ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 1నుంచి 8, 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం యూనిఫాం అందిస్తోంది. దీనిలో భాగంగా ఒక్కో విద్యార్థికి రెండు జతలు అందజేయాల్సి ఉంటుంది. మొత్తం విద్యార్థులు 43,506 మంది ఉండగా ఇందులో బాలికలు 23,212, బాలురు 20,294 మంది ఉన్నారు. ప్రస్తుతం ఒక జత యూనిఫాం మాత్రమే సిద్ధంగా ఉండగా మరో జత కుట్టాల్సి ఉంది. రెండో జతకు సంబంధించిన వస్త్రం ఇటీవలే జిల్లాకు చేరింది.
ఏటా ఆలస్యమే..
పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు యూనిఫాం అందజేయాలి. కానీ, ప్రతి ఏటా అలస్యమవుతోంది. ఈసారి మెదటి రోజే పంపిణీ చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. యూనిఫాం కుట్టే బాధ్యత మహిళా స్వయం సహా యక సంఘాలకు అప్పగించగా, ముందుగానే కొలతలు తీసుకున్నారు. ఒక జత చొప్పున కుట్టడం పూర్తయినట్లు చెబుతున్నారు. రెండో జత కుట్టడానికి రెండు నెలల సమయం తీసుకునే అవకాశం ఉంది.
ఒక జత అందజేస్తాం
ప్రస్తుతం ఒక జత చొప్పున కుట్టడం పూర్తయ్యింది. పాఠశాలల పునఃప్రారంభం రోజు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మూడు, నాలుగు రోజుల్లో పాఠశాలలకు అందజేస్తాం. రెండో జత యూనిఫాంకు సంబంధించి క్లాత్ వచ్చింది. త్వరలో కుట్టు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
–సత్యనారాయణ, డీఈఓ
పాఠశాలల పునఃప్రారంభం రోజున పంపిణీ
ఫ రెండో జత దస్తులు ఇప్పట్లో డౌటే
ఫ ప్రతి సంవత్సరం ఆలస్యమే
ఫ పాత యూనిఫాంతోనే పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి
పాఠశాలలు 730
మొత్తం విద్యార్థులు 43,506
బాలికలు 23,212
బాలురు 20,294