
మిస్ వరల్డ్ వేదికపై పోచంపల్లి ఇక్కత్
భూదాన్పోచంపల్లి: మిస్ వరల్డ్ వేదికపై పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు మరోసారి తళుక్కుమన్నాయి. శనివారం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరిగిన వరల్డ్ ఫ్యాషన్ ఫినాలేలో అమెరికా, కరేబియన్ దేశాలకు చెందిన అందాల భామలు పోచంపల్లి ఇక్కత్తో పాటు గద్వాల్, గొల్లభామ చేనేత వస్త్రాలతో రూపొందించిన అధునాతన ఫ్యాషన్ వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేసి అలరించారు. మన సంస్కృతి ఉట్టిపడేలా నూతన డిజైన్లతో ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్చనా కొచ్చర్ ఇండో వెస్ట్రన్ కలగలిపి ఫ్యాషన్ వస్త్రాలను రూపొందించారు. రెండు రౌండ్లలో జరిగిన మిస్ వరల్డ్ టాప్ మోడల్ ఫ్యాషన్ షోలో 108 మంది అందాల భామలు పాల్గొన్నారు. మొదటి రౌండ్లో మిస్ వరల్డ్ పోటీదారులు ర్యాంప్ వాక్ చేసి పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో మెరిశారు. మిస్ ఇండియా నందిని గుప్తా ఎరుపురంగు గాగ్రా వస్త్రాలతో తళుక్కుమన్నారు. యూరప్ ఖండానికి చెందిన వివిధ దేశాల భామలు గొల్లభామ చేనేత చీరలు ధరించి మెప్పించారు. కాగా ఫ్యాషన్ ఫినాలే న్యాయనిర్ణేతలు సైతం తెలంగాణ సంప్రదాయ వస్త్రాల డిజైన్లు చూసి ప్రశంసలు కురిపించారు. తెలంగాణ చేనేత వస్త్రాల ద్వారానే ఏషియా–ఓషియానా విభాగంలో మన మిస్ఇండియా నందిని గుప్తా టాప్ మోడల్ ఫైనల్ టైటిల్ను సాధించడం విశేషం. మిస్ వరల్డ్ పోటీల వేదిక ద్వారా చేనేత వస్త్రాలకు ప్రచారం పెరిగి మార్కెటింగ్ అవకాశాలు, ఆదరణ పెరిగే అవకాశం ఉందని చేనేత వర్గాలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ నెల 15న పోచంపల్లిలోని టూరిజం పార్కులోని హంపి థియేటర్లో నిర్వహించిన ఇక్కత్ ర్యాంప్ వాక్కు మిస్ వరల్డ్ పోటీదారులు తిలకించడం ద్వారా అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చింది. మిస్ వరల్డ్ పోటీదారులు చేనేత వస్త్రాలనే ధరించి తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. దీంతో కూడా చేనేత వస్త్రాలకు తగిన ప్రాచుర్యం లభించింది.
ఫ ఇక్కత్ వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేసిన అందాల భామలు
ఫ అందర్జాతీయంగా పోచంపల్లికి గుర్తింపు వచ్చిందంటున్న చేనేత కళాకారులు

మిస్ వరల్డ్ వేదికపై పోచంపల్లి ఇక్కత్