దొంగల ముఠా అరెస్ట్
● చౌటుప్పల్లో గత నెల కిరాణ దుకాణంలో
సిగరెట్ల దొంగతనానికి పాల్పడ్డ నిందితులు
● నిందితులంతా రాజస్తాన్ రాష్ట్రానికి చెందినవారే
● రూ.10 లక్షల విలువైన 7 సిగరెట్ కార్టన్లు, కారు, సెల్ఫోన్లు స్వాధీనం
చౌటుప్పల్: రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అనంతరం నల్లగొండ జైలుకు తరలించారు. ఈ ముఠా సభ్యులు గత నెల 6న చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బాలాజీ కిరాణ దుకాణంలో దొంగతనం చేసి రూ.10లక్షల విలువైన 7 సిగరెట్ కార్టన్లు ఎత్తుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ మన్మథకుమార్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ రాష్ట్రం బీవేర్ జిల్లా రాయిపూర్థానా గ్రామానికి చెందిన డ్రైవర్ లక్ష్మణ్రామ్, కినవాడీ గ్రామానికి చెందిన డ్రైవర్ రాఖేష్ కుమావత్, జోధ్పూర్ జిల్లా జాక్ గ్రామానికి చెందిన కూలీ పనిచేసే దినేష్ అలియాస్ దినరామ్, అదే గ్రామానికి చెందిన ప్రైవేట్ జాబ్ చేసే అశోక్జాట్, పాలీ జిల్లాలోని హపత్ గ్రామానికి చెందిన భారత్కుమార్ ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు.
షట్టర్ తాళం పగులగొట్టి దొంగతనం
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ నుంచి చిన్నకొండూర్ రోడ్డు వైపు వెళ్లే దారిలో సర్వీస్ రోడ్డులో ఉన్న బాలాజీ కిరాణ దుకాణంలో గత నెల 6న అర్ధరాత్రి సమయంలో వీరు దొంగతనానికి పాల్పడ్డారు. వీరులో కారులో వచ్చి దుకాణం బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పక్కకు తిప్పారు. రోడ్డు వెంట వెళ్లే వ్యక్తులకు ఏమీ కన్పించకుండా ఉండేందుకు షట్టర్కు అడ్డంగా పరదాలు కట్టారు. ఆ తర్వాత దుకాణానికి వేసిన తాళాన్ని గడ్డపారతో పగులగొట్టి లోనికి ప్రవేశించారు. దుకాణం నుంచి ఎనిమిది సిగరెట్ కార్టన్లను తీసుకొని బయటకు వచ్చారు. అన్నింటిని కారులో వేసుకునేందుకు ప్రయత్నించగా ఏడు మాత్రమే అందులో పట్టాయి. మరొకటి పట్టకపోవడంతో దానిని దుకాణం బయటనే పడేసి కారులో అక్కడి నుంచి పారిపోయారు.
వాహనాల తనిఖీల్లో పట్టుబడిన నిందితులు
దొంగతనం జరిగిన మరుసటి రోజున దుకాణం యజమాని ఊర కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలోని ఆంథోల్ మైసమ్మ దేవాలయం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. అటుగా వెళ్తున్న నిందుతులు కారును అక్కడే ఆపి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పారిపోతున్న నిందితులను వెంబడించి పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారించగా సిగరెట్ కార్టన్ల చోరీ చేసింది తామేనని ఒప్పుకున్నారు. నిందితుల నుంచి కారుతో పాటు రూ.10లక్షల విలువైన 7 సిగరెట్ కార్టన్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో రిమాండ్ చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
దొంగల ముఠా అరెస్ట్
దొంగల ముఠా అరెస్ట్
దొంగల ముఠా అరెస్ట్
దొంగల ముఠా అరెస్ట్


