భీమవరం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలను విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు తనిఖీ నిర్వహించారు. పుస్తకాలు ఉన్న గదిని గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు సాయి కృష్ణ మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి అధిక ఫీజులు, విద్యా సామగ్రి విక్రయాలతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారన్నారు. శ్రీచైతన్య స్కూల్లో అక్రమంగా విద్యాసామగ్రి విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు బి.సింధు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


