భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక మునిసిపల్ కార్యాలయంలో మునిసిపల్ నిధులు (ప్రజాధనం) రూ.5 లక్షల నుంచి 6 లక్షలు నిధులతో ఇండోర్ క్రికెట్ నెట్ అధికారుల కోసం ఏర్పాటు చేస్తున్నారని దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఇటీవల సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మునిసిపల్ అధికారులు ప్రత్యేక అధికారి మునిసిపల్ నిధులు వదులుకుని దాతలను ఆశ్రయించి క్రికెట్ నెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
మోతుగూడెం: చింతూరు మండలం పొల్లూరు పిక్నిక్ స్పాట్ వద్ద స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి ఎం.అఖిల్ (24) అనే యువకుడు మృతి చెందాడు. మృతుడి స్వస్థలం ఏలూరు జిల్లా కామవరపుకోట. మృతుడు ఫొటోగ్రాఫర్గా పని చేస్తున్నాడు. పదిమంది స్నేహితులతో విహార యాత్రకు వచ్చి పొల్లూరు పిక్నిక్ స్పాట్ వద్ద స్నానాలకు దిగి గల్లంతయ్యాడు. అప్రమత్తమైన స్నేహితులు గాలించగా అప్పటికే చనిపోయాడు. విషయం తెలుసుకున్న మోతుగూడెం ఎస్సై నాజర్ హుస్సేన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చింతూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పెనుగొండ : సీఎం చంద్రబాబు ఈ నెల 9న సిద్ధాంతంలో పర్యటించనుండడంతో జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. 9న జరిగే సభలో రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. దీంతో శుక్రవారంస్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జాయింట్ కలెక్టరు టి రాహూల్ కుమార్ రెడ్డితో కలసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఏర్పాట్లు నిర్ణీత గడువులో పూర్తి చేసి పర్యటను విజయవంతం చేయడానికి సిద్ధం గా ఉండాలని అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు.
భీమవరం: ఆంధ్రప్రదేశ్ 16వ హాకీ సీనియర్ రాష్ట్రస్ధాయి టోర్నమెంట్కు జిల్లా హామీ జట్టు ఎంపికను ఈనెల 8న నిర్వహిస్తున్నట్లు హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, వివేక్ సత్యభారత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భీమవరం సెయింట్ మేరీస్ హైస్కూల్ ఆవరణలో సోమవారం ఉదయం 7 గంటలకు ఎంపిక ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడకారులు 1992 జనవరికి ముందు జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు ఎస్ఎస్సీ మార్కుల జాబితా, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్ తీసుకురావాలని; ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 12 నుంచి నాలుగు రోజులపాటు ధర్మవరంలో నిర్వహించే రాష్ట్రస్థాయి టోర్నమెంట్ పాల్గొంటారని వివరించారు.
ద్వారకాతిరుమల: స్థానిక సొసైటీ పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం. మండలంలోని కొమ్మర గ్రామానికి చెందిన మానుకొండ ధర్మరాజు మధ్యాహ్నం ద్వారకాతిరుమలకు వచ్చి, పనులు ముగించుకుని తన టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్పై స్వగ్రామానికి వెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి మోపెడ్ అదుపు తప్పడంతో ధర్మరాజు రోడ్డుపై పడిపోయాడు. దాంతో అతడి తలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 ఆంబులెన్స్ ఈఎంటీ వెంకట్, పైలెట్ సుధాకర్లు క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం స్థానిక పీహెచ్సీకి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


