ఏలూరు (ఆర్ఆర్పేట): కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ మార్చి, ఏప్రిల్ నెలల్లో రణభేరి 3.0 పోరాట కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించినట్టు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి స్పష్టం చేశారు. మంగళవారం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ ఉద్యమం కొనసాగింపుగా రణభేరి 3.0 నిర్వహించాలని రాష్ట్ర సంఘం పిలుపునిచ్చిందన్నారు. దీనిలో భాగంగా ఈనెల 24వ తేదీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒకరోజు నిరాహార దీక్ష, ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో రెండు రోజుల నిరాహార దీక్షలు, ఏప్రిల్ 15 నుంచి 19 వరకు రాష్ట్రస్థాయిలో ఐదు రోజుల నిరాహార దీక్ష, ఏప్రిల్ 28న చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎంవీ శ్యాంబాబు, జిల్లా సహాధ్యక్షుడు ఎస్.సుధారాణి, జిల్లా కోశాధికారి జీవీ రంగమోహన్, జిల్లా కార్యదర్శులు ఏ.విక్టర్ తదితరులు పాల్గొన్నారు.


