ఆకివీడు : గ్యాస్ ధరలు పెంచడం దారుణమని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక శ్రీనగర్ కాలనీలో ఆదివారం కట్టెల పొయ్యిపై గ్యాస్ బండ ఉంచి నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకుడు పెంకి అప్పారావు మాట్లాడుతూ యుద్ధం పేరుతో గ్యాస్ సిలిండర్ ధరను పెంచిన మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహిళా దినోత్సవం రోజున మహిళలకు కానుకగా గ్యాస్ ధర పెంచడం విచారకరమన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్ని తీవ్రంగా ఖండించారు. పెంచిన గ్యాస్ ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపుతో ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకు సీపీఎం నాయకురాలు దొడ్డి పద్మ అధ్యక్షత వహించారు.
భీమవరం: భీమవరంలోని వోల్గా ఆర్చరీ అకా డమీలో ఆదివారం రాష్ట్రస్థాయి అండర్–15, 13, 10 ఆర్చరీ పోటీలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు ఎంపికకు పోటీలు నిర్వహించారు. సుమారు 40 మంది బాలబాలికలు ఇండియన్ రౌండ్, కాంపౌండ్, రికవరీ కేటగిరీల్లో తలపడ్డారు. జిల్లా జట్లను ఎంపిక చేశారు. వీ రు ఈనెల 11 నుంచి 13 వరకు నూజివీడులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆ ర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్.జయ రాజు తెలిపారు. జిల్లా స్పోర్ట్స్ అధికారి మోహన్దాస్ క్రీడాకారులను అభినందించారు. కోచ్ లు ఈ.సాహిత్, కమల్ కిశోర్, జయలక్ష్మి పోటీలను పర్యవేక్షించారు.
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
తాడేపల్లిగూడెం రూరల్: మద్యం మత్తులో లిక్కర్లో గడ్డి మందు కలుపుకుని తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసినట్టు రూరల్ పోలీసులు తెలిపారు. ఆదివారం వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఉండవల్లి నారాయణరావు (70) మద్యానికి బానిసై శనివారం ఆ మత్తులో మద్యంలో గడ్డి మందు కలిపి సేవించాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందాడు. మృతుని కుమార్తె రాయుడు రాజామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, రూరల్ ఏఎస్సై బి.గోపీనాథ్ దర్యాప్తు చేస్తున్నారు.


