భీమవరం : మహిళలపైనే దేశ పురోగతి ఆధారప డి ఉందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. స్థానిక విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయా పథకాల ద్వారా మహిళల జీవితాల్లో స్పష్టమైన, సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు స్వయం సహాయక సంఘాలు దోహదపడతాయన్నారు. భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి షైనీ, ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత తదితరులు మాట్లాడారు. ముద్ర, పీఎంఈజీపీ, పీఎం ఎఫ్ఎంఈ, విశ్వకర్మ పథకాల కింద 62,833 మంది లబ్ధిదారులకు రుణాలు అందించారు. జిల్లాలో ఆర్థిక ప్రగతి సాధించిన పారిశ్రామికవేత్తలను కలెక్టర్ సత్కరించారు. విశేష ప్రతిభ కనబరిచిన ఉద్యోగినులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


