నేత్రపర్వం ఏకాదశి ఉత్సవం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీవారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజాధికాలను జరిపి, హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు.


