
ఎరువుల దుకాణాల్లో సోదాలు
తణుకు అర్బన్: తణుకులో ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ముందుగా జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ కర్మాగారాన్ని ఆకస్మిక తనిఖీ చేసి స్టాకు నిల్వలు, నాణ్యత పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం రైల్వేస్టేషన్ రోడ్డులోని నారాయణ అగ్రికేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దుకాణంలో సోదాలు చేసి నకిలీలను విక్రయించవద్దని వ్యాపారులను హెచ్చరించారు. పట్టణవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో సరైన పత్రాలు లేనందున రూ.61,61,050 విలువైన బయో స్టిములెంట్స్ విక్రయాలను నిలుపుదల చేశారు. సహాయ వ్యవసాయ సంచాలకులు బుల్లిబాబు, నరేంద్ర, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ పోలీస్ గోపాలకృష్ణ, మండల వ్యవసాయ అధికారి రాజేంద్రప్రసాద్, వ్యవసాయ అధి కారి (టెక్నికల్) కృష్ణకాంత్ పాల్గొన్నారు.
రైతుల అభ్యంతరాలపై విచారణ
భీమవరం (ప్రకాశంచౌక్): జాతీయ రహదారి– 165లో భాగంగా పాలకోడేరు మండలం విస్సాకోడేరు, పెన్నాడ అగ్రహారం, శృంగవృక్షం గ్రామ రైతులు లేవనెత్తిన ఆరు అభ్యంతరాలపై గురువారం జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి ఎన్హెచ్ అధికారుల సమక్షంలో విచారణ చేపట్టారు. రోడ్డు అలైన్మెంట్, నష్టపరిహారం చెల్లింపు తదితర విషయాలను రైతులు జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని జేసీ చెప్పా రు. భూములను ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, న్యాయమైన పరిహారం అందించాలని రైతులు కోరారు. అలైన్మెంట్ ఏ సర్వే నంబర్ నుంచి వెళ్తుందనే వివరాలను రైతులు కోరగా త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను అందిస్తామని జేసీ తెలిపారు. గొరగనమూడి గ్రామం నుంచి రైతులు ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తలేదు. ఎన్హెచ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్అండ్బి ఎన్.శ్రీనివాస్రావు, పాలకోడేరు తహసీల్దార్ ఎన్.బి.విజయలక్ష్మి కలెక్టరేట్ ల్యాండ్ సూపరింటెండెంట్ సీహెచ్ రవికుమార్ పాల్గొన్నారు.
‘భవ్య భీమవరం’
పనులు వేగిరపర్చాలి
భీమవరం (ప్రకాశంచౌక్): భవ్య భీమవరం పేరిట చేపట్టిన అభివృద్ధి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనులపై దా తలు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనులు ప్రారంభించి ఆరు నెలలు దాటిందన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ఆరు నెలల క్రితమే అమలు చేసినా ఇప్పటికీ ఎందుకు కట్టడి చేయలేకపోతున్నా రని అధికారులను ప్రశ్నించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కనిపిస్తే శానిటరీ సెక్రటరీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రతి పట్టణంలో చేపట్టాల్సిన పింక్ టాయిలెట్ల నిర్మాణంలో అవరోధాలపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తణుకు బస్టాండ్లో శంకుస్థాపన చేసిన పింక్ టాయిలెట్ నిర్మాణంపై సాకులు చూపిస్తున్న ఆర్టీసీ ఆర్ఎంపై అసహనం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణంలో అనుమతి లేని బ్యానర్లు, హోర్డింగులను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జేసీ టి.రాహుల్కుమార్ రెడ్డి, భీమవరం ము న్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు ఓపీఎస్ కోసం నిరసన
ఏలూరు (ఆర్ఆర్పేట)/ద్వారకాతిరుమల: డీఎ స్సీ 2003 ఉపాధ్యాయులు, 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ విడుదలై సీపీఎస్ పరిధిలోని గ్రూప్ 2 ఉద్యోగులు, కానిస్టేబుళ్లకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా పాత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏలూరులో నిరసన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని డీఎస్సీ 2003 టీచర్స్ ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ కట్టా శ్రీనివాసరావు, జిల్లా కన్వీనర్లు వి.జగదీష్, ఈ.శంకర్, బాలసుబ్రహ్మణ్యం, రమేష్, గోపాలకృష ఓ ప్రకటనలో కోరారు.
సంపూర్ణ మద్దతు : ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఫ్యాప్టో ఏలూరు జిల్లా చైర్మన్ జి.మోహన్, సెక్రటరీ జనరల్ ఎం. ఆదినారాయణ, ఫ్యాప్టో సభ్య సంఘాలు, ఇతర ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు తెలిపారు.

ఎరువుల దుకాణాల్లో సోదాలు