
మునిసిపల్ కార్మికుల పోరు ఉద్ధృతం
పోటీ కార్మికులను దింపడంపై అభ్యంతరం
తాడేపల్లిగూడెం (టీఓసీ): మునిసిపాలిటీ ఆధ్వర్యంలో పాతూరు శివారు హెడ్ వాటర్ వర్క్స్, ఫిల్టర్ ప్లాంట్లు వద్ద పోటీ కార్మికులను దింపారన్న విషయాన్ని తెలుసుకున్న ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు సాయంత్రం నిరసన శిబిరం వద్ద నుంచి బైక్ ర్యాలీగా స్థానిక హెడ్ వాటర్స్ వర్క్స్ గేటు వద్దకు చేరుకున్నారు. పోటీ కార్మికులను తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. నిరసన కార్యక్రమం వద్దకు పోలీసులు చేరుకుని వాటర్ సప్లైను అడ్డుకోవడం సరికాదని, ప్రజలు ఇబ్బందులను గుర్తించాలని, లేని పక్షంలో అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గబోమని, ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తొలుత స్థానిక పురపాలక సంఘం కార్యాలయం వద్ద మునిసిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికులు సోమవారం 8వ రోజు చేపట్టిన నిరసన దీక్షలకు సీఐటీయూ నేతలు సంఘీభావం తెలిపారు.
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని నగరపాలక సంస్థల్లో, పురపాలక సంఘాల్లో, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగంలోని అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని మునిసిపల్ ఇంజినీరింగ్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్ఆర్ పేట ఎస్ ఆర్ టు వద్ద ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన గేటు మీటింగ్లో వారు మాట్లాడారు. ఏళ్ల తరబడి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని ఏఐటీయూసీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఏ అప్పలరాజు, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బి నాగేశ్వరరావు, కోశాధికారి బి నారాయణరావు, యూనియన్ నాయకులు నారా శ్రీను, కందుల శ్రీనివాస్, అప్పారావు తదితరులు నాయకత్వం వహించారు.
నరసాపురంలో అర్ధనగ్నంగా జలదీక్ష
నరసాపురం: స్థానిక వశిష్టగోదావరి వలంధర్రేవు గోదావరిమాత విగ్రహం వద్ద కార్మికులు సోమవారం వినూత్నరీతిలో ఆందోళన చేశారు. అర్ధనగ్నంగా గోదావరిలో దిగి జలదీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రవమానికి జేఏసీ కమిటీ నాయకులు ఆర్ రత్నం, వి.ఫణి, ఎం.సత్యనారాయణ, కె.కాశీ, సీహెచ్ వాసు, ఎ.మధుబాబు, ఎం.సుజాత, టి.కళ్యాణి, ఎస్ దేవి, కె.అనంతలక్ష్మి నాయకత్వం వహించారు.
ఇకపై పూర్తిస్థాయి సమ్మె
తణుకు అర్బన్: ఇకపై పూర్తి స్థాయి సమ్మెకు దిగుతున్నట్లు మునిసిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు ఉండ్రాజవరపు శ్రీను, గెల్లా విజయ్కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం మునిసిపల్ కమిషనర్ టి.రామ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సమ్మెలో భాగంగా మునిసిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో కార్మికులు తమ నిరాహారదీక్షలను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో దాసరి సత్యనారాయణ, పిండి పెద్ధిరాజు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ మద్దతు
జంగారెడ్డిగూడెం: న్యాయమైన కోర్కెల కోసం మునిసిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు చేపట్టిన ఆందోళనలకు వైఎస్సార్ సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళనల్లో భాగంగా యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కమిషనర్కు సమ్మె నోటీస్ ఇచ్చినట్లు యూనియన్ అధ్యక్షుడు కంతేటి వెంకట్రావు తెలిపారు. ఇకపై పట్టణంలో వీధిదీపాలు నిలుపుదల చేస్తామని, దశలవారీగా మంచినీటి సప్లయ్ కూడా నిలుపుదల చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమ్మెకు మద్దతుగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్పర్సన్ కంచర్ల వాసవి నాగరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్సార్సీపీ టౌన్ ప్రెసిడెంట్ చిటికెల అచ్యుతరామయ్య, కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.
ఉద్యోగ భద్రత కోసం మునిసిపల్ ఇంజనీరింగ్, అవుట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన పోరు ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు వాటర్వర్క్స్, లైటింగ్ విభాగాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కరి చొప్పున సహకరించామని, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో శ్రద్ధ చూపకపోవడంతో ఇకపై పూర్తిస్థాయి ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. తమను పర్మినెంట్ చేసి టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిరాహార దీక్షలు, అర్ధ నగ్న ప్రదర్శనలు
అధికారులకు సమ్మె నోటీసులు
ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్
ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక

మునిసిపల్ కార్మికుల పోరు ఉద్ధృతం

మునిసిపల్ కార్మికుల పోరు ఉద్ధృతం

మునిసిపల్ కార్మికుల పోరు ఉద్ధృతం

మునిసిపల్ కార్మికుల పోరు ఉద్ధృతం