
సాక్షి కార్యాలయంపై దాడి హేయం
కామవరపుకోట/నిడమర్రు/ఉంగుటూరు: పత్రికల్లో వార్తలు ప్రచురించారనే అక్కసుతో సాక్షి పత్రిక కార్యాలయాలపై దాడి చేయడం హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు అన్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై టీడీపీ మూకలు చేసిన దాడిని ఖండిస్తూ బుధవారం మండలంలో ఆడమిల్లిలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పత్రికల స్వేచ్ఛను హరించే ఇలాంటి పనులు ప్రజాస్వామ్యంలో సరైనవి కావని, దుశ్చర్యలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు. సాక్షి కార్యాలయంపై టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడిని ఖండిస్తూ నిడమర్రు పోలీస్ స్టేషన్లో బుధవారం ఎాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సై వీరప్రసాద్కు ఫిర్యాదు చేశారు. జెడ్పీటీసీ కోడే కాశి మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరించేలా ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడులు చేసి ఫర్నీచర్ తగల బెడుతున్నా పోలీసులకు పట్టదా? అని ప్రశ్నించారు. మీడియాను బెదిరించి దౌర్జన్యాలకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైఎస్సార్సీపీ పార్టీ బూత్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి యెలిశెట్టి పాపారావు బాబ్జి అన్నారు. బుధవారం చేబ్రోలు పోలీస్ స్టేషన్లో విలేకరులతో కలిసి దాడులపై ఫిర్యాదు చేశారు. మీడియా వ్యవస్థపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని, దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు.
పత్రికా కార్యాలయాలపై దాడులు సరికాదు
ఏలూరు(ఆర్ఆర్పేట): ఏలూరులో సాక్షి కార్యాలయం వద్ద ఫర్నిచర్ను తగలబెట్టిన ఘటన దురదృష్టకరమని, పత్రికా కార్యాలయంపై దాడులను పూర్తిగా ఖండిస్తున్నామని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడడం, కార్యాలయాలపై దాడులకు పూనుకోవడం హేయమైన చర్యలని అన్నారు. ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా ఉండేలా పోలీస్ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.