జగన్‌ను కలిసిన కొట్టు సత్యనారాయణ | - | Sakshi
Sakshi News home page

జగన్‌ను కలిసిన కొట్టు సత్యనారాయణ

Jun 11 2025 11:55 AM | Updated on Jun 11 2025 11:55 AM

జగన్‌ను కలిసిన కొట్టు సత్యనారాయణ

జగన్‌ను కలిసిన కొట్టు సత్యనారాయణ

తాడేపల్లిగూడెం అర్బన్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డిని మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్‌సీపీ అభివృద్ధికి పాటుపడాలని, భవిష్యత్తులో మనమే అధికారంలోకి వస్తామని వైఎస్‌ జగన్‌ను అన్నట్లు కొట్టు సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4న వెన్నుపోటు దినం తాడేపల్లిగూడెంలో భారీగా నిర్వహించడం సంతోషకరమని, పార్టీ పిలుపు మేరకు భవిష్యత్తులో మరిన్ని పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించినట్లు చెప్పారు. పార్టీ నియోజకవర్గ నాయకులందరినీ ఒకతాటిపైకి తీసుకురావాలని, పార్టీ అభివృద్ధి కోసం ప్రజలతో మమేకం కావాలని పార్టీ అధినేత సూచించినట్లు తెలిపారు. జగన్‌మోహనరెడ్డిని కలిసిన వారిలో ముప్పిడి సంపత్‌కుమార్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు కొలుకులూరి ధర్మరాజు, 2వ పట్టణ ఇన్‌చార్జి కర్రి భాస్కరరావు తదితరులున్నారు.

టిడ్కో ఇళ్లు ఇవ్వాలంటూ ధర్నా

భీమవరం: భీమవరం పట్టణంలో టిడ్కో, జగనన్న ఇళ్లు సత్వరం పంపిణీ చేయడమే గాక ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించుకున్నవారికి ఇళ్ల పట్టాలు తక్షణం ఇవ్వాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం భీమవరం ఆర్డీవో కార్యాలయం వద్ద టిడ్కో, జగనన్న ఇళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. తాడేరు రోడ్డులో 82 ఎకరాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్లు ఇంతవరకు ఇవ్వకపోవడం అధికారులు, ప్రజాప్రతినిధుల చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. జగనన్న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో అనేకసార్లు ధర్నాలు నిర్వహించినా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కూటమి నేతలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉన్నవారికి ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో విడుదల చేసినా ఇంతవరకు ఎక్కడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు డి.కళ్యాణి, ఎం.వైకుంఠరావు, డి.త్రిమూర్తులు, చెల్లుబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దేవస్థానం ఉద్యోగుల బదిలీ

ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో పనిచేసే పలువురు ఉద్యోగులను బదిలీ చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌ రామచంద్ర మోహన్‌ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో పనిచేసే కొందరు ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (డీఈఓ) బాబురావు, జూనియర్‌ అసిస్టెంట్‌ కేహెచ్‌ ప్రసాద్‌లు అన్నవరం దేవస్థానానికి, సూపరింటిండెంట్‌ డీవీ నరసింహరాజు పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ దేవస్థానానికి, సీనియర్‌ అసిస్టెంట్‌ కేవీ నరసింహ, జూనియర్‌ అసిస్టెంట్‌లు ఎ.చిట్టిబాబు, వి.జగన్నాథరావులు విజయవాడ దేవస్థానానికి బదిలీ అయ్యారు. అరసవెల్లి దేవస్థానంలో డీఈఓగా పనిచేస్తున్న భద్రాజీ, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో ఏఈఓగా పనిచేస్తున్న జి.ఉమాపతి, విజయవాడ దేవస్థానంలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వి.కుటుంబరావు, సూపరింటిండెంట్‌గా పనిచేస్తున్న వి.నగేష్‌, సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.తులసీరామ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కేవీబీ కాత్యాయనిలు, అన్నవరం దేవస్థానంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎ.శ్రీనివాసరావు, జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.పవన్‌ కుమార్‌ ద్వారకాతిరుమల దేవస్థానానికి బదిలీ అయ్యారు. డిప్యుటేషన్‌పై అన్నవరం దేవస్థానానికి బదిలీపై వెళ్లిన సూపరింటిండెంట్‌ జి.సుబ్రహ్మణ్యం, సీనియర్‌ అసిస్టెంట్‌ పీవీ శ్రీనివాసరావును ద్వారకాతిరుమలకు బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement