
పోలీసుల సాక్షిగా దారుణం
మూడు రోజులుగా ఏలూరు సాక్షి ఆఫీసు వద్ద దాడులు
ఏలూరు టౌన్: ఏలూరు ఎన్ఆర్ పేటలోని సాక్షి జిల్లా కార్యాలయం కింద ఉన్న ఫర్నీచర్ను టీడీపీ గూండాలు పెట్రోలు పోసి తగలబెట్టడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తమ ఇళ్లకు ఎక్కడ నిప్పు అంటుకుంటుందోనని ఆందోళనకు గురయ్యారు. అధికార టీడీపీ నేతల ప్రొద్బలంతో సాక్షి కార్యాలయంపై వరుసగా మూడు రోజులు దాడులకు తెగబడడం రెడ్బుక్ రాజ్యాంగం కాక ఇంకేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏలూరు ఎన్ఆర్ పేటలోని సాక్షి జిల్లా కార్యాలయం వద్ద గత మూడు రోజులుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఏలూరు సాక్షి కార్యాలయం వద్దకు దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు భారీగా వస్తున్నారనే విషయం పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగానికి తెలియకపోవడం గమనార్హం. సాక్షి కార్యాలయం వద్ద భవన యజమానులకు సంబంధించిన ఫర్నీచర్ను పెట్రోలు పోసి తగలబెడుతున్నా అక్కడ ఉన్న పోలీసులకు గానీ, నిఘా విభాగానికిగాని ఏ మాత్రం తెలియకపోవడం శోచనీయం.
మీడియా గొంతునొక్కే ప్రయత్నం : ఏలూరు సాక్షి కార్యాలయంపై దెందులూరు టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడి ఫర్నీచర్ను పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటనను పలువురు తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. అగ్నికి ఆహుతైన ఫర్నీచర్ను పరిశీలించారు. గతంలో సాక్షి కార్యాలయంలో ధ్వంసం చేసిన కంప్యూటర్లను సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మీడియా గొంతునొక్కే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు పత్రికా కార్యాలయాలపై దాడులకు దిగడం దుర్మార్గమన్నారు. జిల్లా ఎస్పీ ప్రతాప శివ కిషోర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్రమైన దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి శిక్షించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇదే తరహాలో ప్రభుత్వంలో ఉన్న నాయకులు మీడియాపై దాడులకు పాల్పడటం ద్వారా చెడు సంప్రదాయానికి బీజం వేస్తున్నట్లు అవుతుందని ఇలాంటివి ఎవరు చేసినా తప్పేనని అభిప్రాయపడ్డారు.