
స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు గండి
పాత బకాయిలు చెల్లించకపోతే చేర్చుకోమంటున్న విద్యాసంస్థలు
భీమవరం: విద్యకు పెద్దపీట వేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల విద్యార్థులకు సైతం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యనందించడానికి తీసుకున్న చర్యలు కూటమి ప్రభుత్వంలో బెడిసికొడుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం పేద విద్యార్థులకు కల్పించాల్సిన ఉచిత ప్రవేశాలను రెండేళ్లుగా ఫీజు బకాయిలు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది అవకాశమిచ్చేదిలేదని కొన్ని స్కూళ్లు తెగేసి చెబుతున్నాయి. దీంతో ప్రైవేటు స్కూళ్లలో తమ బిడ్డలను చదివించాలనే తల్లిదండ్రుల ఆశలకు గండిపడుతోంది. జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 700 వరకు ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్ధలున్నాయి. వాటిలో ఉచిత విద్యనందించడానికి 397 స్కూళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి.
1,380 మంది విద్యార్థుల దరఖాస్తు
ప్రైవేటు స్కూళ్లలో తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలనే ఆసక్తి ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు స్తోమత లేకపోవడంతో ప్రభుత్వ బడుల్లోనే చేరుస్తుంటారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్మోహనన్ రెడ్డి ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా విద్యనందించేలా చర్యలు తీసుకున్నారు. దానిని కొనసాగింపుగా ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరడానికి దరఖాస్తులు చేసుకోడానికి అవకాశం కల్పించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 1,380 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2023లో 1,162 మంది సీట్లు దక్కించుకోగా 2024లో 1,163 మంది విద్యార్ధులు అడ్మిషన్లు పొందారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి కేవలం 912 మందిని మాత్రమే విద్యాశాఖ ఎంపిక చేసింది. 5 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఒకటవ తరగతిలో ప్రవేశం కల్పిస్తుండగా రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లను ఆడపిల్లలు, హెచ్ఐవీ బాధిత పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం సీట్లు, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 6 శాతం సీట్లు ఇవ్వాల్సివుంది. ఇంతవరకు బాగానే ఉన్నా విద్యాశాఖ ఎంపిక చేసిన పిల్లలను చేర్చుకోడానికి ప్రైవేటు విద్యాసంస్ధలు ముందుకురావడం లేదు. గత మూడేళ్లుగా తమకు చెల్లించాల్సిన ఫీజులు చెల్లిస్తేనే తమ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. దీనితో ఎంపికై న విద్యార్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
చేర్చుకోకుంటే స్కూల్ గుర్తింపు రద్దు చేస్తాం
పేద విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరికకు తప్పనిసరిగా అవకాశం కల్పించాలి. విద్యార్థులను చేర్చుకోకుంటే ఆయా స్కూళ్ల గుర్తింపు రద్దుచేసేలా ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. జిల్లాలో ఎంపికై న 912 మంది విద్యార్థులను చేర్చేలా కృషిచేస్తున్నాం.