వేటకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

వేటకు సన్నద్ధం

Jun 9 2025 8:04 AM | Updated on Jun 9 2025 8:04 AM

వేటకు

వేటకు సన్నద్ధం

నరసాపురం : సముద్రంలో వేట నిషేధ కాలం గడువు ముగియనుంది. మరో ఆరు రోజుల్లో సముద్రంలో వేట ప్రారంభం కానుంది. దీంతో నరసాపురం తీర ప్రాంతంలో వేట సాగించే మత్స్యకారులు వేటకు సమాయత్తమవుతున్నారు. రెండు నెలలుగా వలలు మూలనపెట్టి ఇళ్లకే పరిమితమైన మత్స్యకారులు వేట సామగ్రి సిద్ధం చేసుకుంటున్నారు. వలలు, బోట్లు మరమ్మతులు చేసుకుంటున్నారు. ఈనెల 14న (శనివారం) అర్ధరాత్రి నుంచి మళ్లీ సముద్రంలో వేట ప్రారంభం కానుంది. చేపల పునరుత్పత్తి సీజన్‌ కావడంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వేసవిలో సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తుంది. ఏటా ఏప్రిల్‌ 14 నుంచి జూన్‌ 15 వరకు ఇది అమలులో ఉంటుంది. ఈ 61 రోజులు మత్స్యకారులు ఖాళీగా ఉంటారు.

గత ప్రభుత్వంలో అండగా..

వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఉపాధి లేక ఆకలితో జీవితాలను గడుపుతుంటారు. 2019–24 కాలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేట నిషేధ సాయాన్ని వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం పేరుతో అందించింది. 2014కు ముందు కేవలం 64 మందికి మాత్రమే లబ్ధి అందించగా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను 1,454కు పెంచింది. అలాగే సాయాన్ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచింది.

విపత్తులతో ‘వల’విల

గతేడాది మత్స్యకారులకు సముద్రం వేట కలిసిరాలేదు. 2024 జూన్‌లో వేట మొదలు పెట్టిన వెంటనే వరుసగా తుపానులు, అల్పపీడనాలతో సముద్రంలోకి వెళ్లిన బోట్లు పట్టుమని ఒకటి, రెండు రోజులు కూడా వేట సాగించకుండా తీరానికి చేరాల్సి వచ్చింది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాకుండా నష్టాలు చవిచూశారు. దీనికి తోడు ఆ ఏడాదిలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌ వేట నిషేధ సాయం అందించలేదు. దీంతో వేట కార్మికులు అప్పులపాలయ్యారు. నిషేధం అనంతరం రెండు నెలల పాటు సముద్రంలో అపారంగా మత్స్య సంపద దొరుకుతుంది. ప్రకృతి కరుణిస్తే మత్స్యకారులు ఆదాయం గడిస్తారు. ఈ ఏడాదైన ప్రకృతి కరుణించాలని గంగపుత్రులు వేడుకుంటున్నారు.

తీరంలో జోరుగా వేట

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 19 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉన్న నరసాపురంలో రోజూ జోరుగా వేట సాగుతుంది. బంగాళాఖాతానికి సంబంధించి ముఖ్యమైన ప్రాతం కావడం, గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశం ఇక్కడే ఉండటంతో ఇక్కడి తీరంలో మత్స్య సంపద అపారంగా దొరుకుతుంది. నెల్లూరు, విశాఖ, కృష్ణా, తూర్పుగోదావరి తదితర జిల్లాలకు చెందిన సుమారు 150 వరకూ మెకనైజ్డ్‌ బోట్లు ఇక్కడ నిత్యం సముద్రంలో వేట సాగిస్తుంటాయి. ఏడాదికి రూ.300 కోట్లకుపైగా మత్స్యసంపద ఇక్కడ దొరుకుతుంది. ఇక దాదాపు 2 వేల మంది వరకూ పూర్తిగా వేటనే నమ్ముకుని ఇక్కడ బతుకుతున్నారు.

6 రోజుల్లో ముగియనున్న వేట నిషేధం గడువు

14న అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేట

వేట సామగ్రి సిద్ధం చేసుకుంటున్న మత్స్యకారులు

వరుస విపత్తులతో గతేడాది సవ్యంగా సాగని వేట

వేట కోసం ఎదురుచూస్తున్నాం

వేట సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఇంకో వారం రోజుల్లో వేట ప్రారంభమవుతుంది. మాకు వేరే పని తెలియదు. ఈ రెండు నెలలు ఖాళీగానే ఉన్నాం. వేట విరామం తర్వాత సముద్రంలో చేపలు బాగా దొరుకుతాయి. చేపలు పైకి బాగా తేలి వలలకు చిక్కుతాయి. మాకు సముద్రంలో ఈనెల సీజన్‌. కాకపోతే తుపానులు అవీ పట్టకూడదు.

– పెమ్మాడి నాగరాజు, మత్స్యకారుడు, నరసాపురం

సౌకర్యాలు మెరుగుపరచాలి

వేట సాగించే మత్స్యకారులకు ప్రభుత్వాలు సౌకర్యాలు మెరుగుపరచాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వంలో బియ్యపుతిప్పలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి రూ.360 కోట్లతో టెండర్లు పిలిచి పనులు చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వంలో హార్బర్‌ నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మత్స్య ఎగుమతులను ప్రోత్సహించాలనే ఆలోచనలో ప్రస్తుత ప్రభు త్వాలు లేకపోవడం దారుణం.

– బర్రి శంకరం, మత్స్యకార నేత

వేటకు సన్నద్ధం 1
1/3

వేటకు సన్నద్ధం

వేటకు సన్నద్ధం 2
2/3

వేటకు సన్నద్ధం

వేటకు సన్నద్ధం 3
3/3

వేటకు సన్నద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement