ఆర్వో ప్లాంట్లకు మోక్షం ఎప్పుడో?
అభివృద్ధి అంటే అలా ఉండేది
● నాటి జగనన్న ప్రభుత్వంలో మంజూరైన ఆర్వో ప్లాంట్లు
● నేటికీ పాఠశాలల్లో మూలన పడి ఉన్న వైనం
పాలకొల్లు సెంట్రల్: నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు నేడు రెండో విడతలో కొన్ని పాఠశాలలకు ఆర్వో ప్లాంట్ మెటీరియల్స్ను పంపించారు. అవి పంపించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా నేటికీ ఆయా పాఠశాలల్లో అవి సీల్ కవర్లలోనే ఉండడం గమనార్హం. ఆర్వో ప్లాంట్ సిస్టం అమర్చడానికి టెక్నీషియన్లు దొరకలేదని చెబుతుండడం విశేషం. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో ఆర్వో ప్లాంట్లను ఇన్నోవేటివ్ ఆక్వా ఏజెన్సీ సంస్థ సప్లయి చేసిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆ ఆర్వో ప్లాంట్ మెటీరియల్స్ పాఠశాలల్లో బిగించాల్సి ఉంది. ఆ సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో వాటిని పాఠశాలల్లో అమర్చే పనులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అప్పటి నుంచి నేటివరకు కూటమి ప్రభుత్వం వాటిని పాఠశాలల్లో అమర్చలేకపోయింది.
ప్రధానోపాధ్యాయులపై అభాండం వేసే ఉద్దేశమా..?
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆర్వో ప్లాంట్లు పాఠశాలల్లో మూలకు చేరి ఉన్నాయి. వాటిని అమర్చాలంటే టెక్నీషియన్లు ఉండాలి. దీనిపై జిల్లా నోడల్ ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. వీటిపై నేడు కదలిక వచ్చి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాలతో గత 20 రోజులు క్రితం సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో ఆర్వో ప్లాంట్లకు సంబంధించిన ఏజెన్లీ వాళ్లు కాంట్రాక్ట్ అయిపోయిందని ముందుకు రావడంలేదు. కాబట్టి ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేసే విదంగా కృషి చేయాలని మండల విద్యాశాఖాధికారులు సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఉపాధ్యాయులు వాటిని పాఠశాలల్లో అమర్చలేకపోతే ఓ రెండు నెలలు తరువాత ఆర్వో ప్లాంట్లను ఎందుకు అమర్చలేకపోయారని హెచ్ఎంలను బాధ్యులను చేస్తూ నిలదీసే అవకాశం ఉంటుందని కొందరు హెచ్ఎంలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా మండలంలో సుమారు 16 వరకూ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ మెటీరియల్స్ బాక్స్ల్లో భద్రంగా మూలన ఉన్నాయి.
నేటి మనబడి మన భవిష్యత్లో భాగంగా పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేయడానికి కృషి చేస్తున్నాం. వాటిని అమర్చే టెక్నీషియన్లు దొరకకపోవడం వల్ల ఆలస్యం అవుతుంది. ఓ వారం పది రోజుల్లో ఆర్వో ప్లాంట్లను బిగించడం జరుగుతుంది. మండలంలో 20 ఆర్వో ప్లాంట్లు మంజూరుకాగా ఎనిమిది పాఠశాలల్లో అమర్చాల్సి ఉంది.
– ఆర్ఎన్వీవీ శర్మ, ఎంఈవో 2, పాలకొల్లు మండలం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థి తాను కూడా కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో చదువుకుంటున్నాననే భరోసా కల్పించేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు – నేడు ద్వారా పాఠశాలలను కోట్లాది రూపాయల వ్యయంతో ఆధునీకరించారు. అలాగే మంచి పోషకాహారంతో మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశారు. స్కూల్ పిల్లలకు దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్లు, బల్లలు, డిజిటల్ బోర్డులు, ట్యాబ్లు ఇలా అనేక వసతులు కల్పిస్తూ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. దానితో నాడు ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల నుంచి తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఒకానొక సమయంలో పట్టణంలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హౌస్పుల్ బోర్డు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. నాటి అభివృద్ధి అలా ఉండేది.
ఆర్వో ప్లాంట్లకు మోక్షం ఎప్పుడో?


