
కదం తొక్కిన ఉపాధ్యాయులు
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల్లో నెలకొన్న సమస్యలను, ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలనే డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరులోని పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. డీఈఓ కార్యాలయ గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 500 మంది ఉపాధ్యాయులు హాజరై నిరసన తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మద్దతుగా నిలిచారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే జోక్యం చేసుకుని తక్షణమే ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికతో చర్చించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే జరిపిన చర్చల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు ఎనేబుల్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఉపాధ్యాయులను మోసం చేయడమే అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీదేవి మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని, ఎస్జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తే దాదాపు 2 వేల పాఠశాలలకు ప్రయారిటీ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, ఇది తీవ్ర మానసిక ఒత్తిడితో కూడిన పని అన్నారు. ముట్టడి కార్యక్రమానికి యూటీఎఫ్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్ అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు, రాష్ట్ర బాధ్యులు ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. యూటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు షేక్ ముస్తఫా ఆలీ, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్కుమార్, ఏపీటీఎఫ్ 1938 ప్రధాన కార్యదర్శి జి.మోహన్, పీఆర్టీయూ అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, పీఈటీస్ అసోసియేషన్ నాయకులు రమేష్, వైఎసా్స్ర్ టీఏ మోహనరావు, యూటీఎఫ్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి ఏకేవీ రామభద్రం, పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎస్టీయూ నాయకులు శ్రీనివాస్ వర్మ, ఏపీటీఎఫ్ గౌరవాధ్యక్షుడు సీహెచ్ పట్టాభిరామయ్య తదితరులు హాజరయ్యారు. అనంతరం డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మని కలిసి సమస్యలను తెలియజేశారు.
డీఈఓ కార్యాలయం వద్ద గుమిగూడిన ఉపాధ్యాయులు
వెబ్ కౌన్సెలింగ్పై మండిపాటు
ఏలూరులో డీఈఓ కార్యాలయం ముట్టడి
వెబ్ ఆప్షన్లు అప్రజాస్వామికం
వెబ్ ఆప్షన్ల విధానంతో గతంలో చాలామంది ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు. ఆన్లైన్లో కనిపించే రెండు వేలకు పైగా స్థానాలను గుర్తించడం ఉపాధ్యాయులకు కష్టతరమవుతోంది. దీంతో కొందరు 150 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లాల్సి వచ్చింది. మరోసారి ఇలాంటి విధానంతోనే నిర్వహిస్తామనడం అప్రజాస్వామికం. ఉపాధ్యాయుల బదిలీలను మాన్యువల్ విధానంలోనే నిర్వహించాలి. లేకుంటే ఉపాధ్యాయుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుంది.
– రవికుమార్ రుద్రాక్షి, యూటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు

కదం తొక్కిన ఉపాధ్యాయులు

కదం తొక్కిన ఉపాధ్యాయులు