చట్టపరిధిలో పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

చట్టపరిధిలో పరిష్కారం

Jun 3 2025 6:52 AM | Updated on Jun 3 2025 6:52 AM

చట్టపరిధిలో పరిష్కారం

చట్టపరిధిలో పరిష్కారం

భీమవరం: ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత సమయంలో చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి పోలీసు అధికారులు ఆదేశించారు. సోమవారం భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరి ష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)లో ప్రజల నుంచి 17 అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులు ఆదేశించారు. పోలీస్‌ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా ఉండాలన్నారు. అదనపు ఎస్పీ (అడ్మిన్‌) వి.భీమారావు, జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

భూములిచ్చిన రైతులకు పరిహారం

భీమవరం: ఆకివీడు–దిగమర్రు ఎన్‌హెచ్‌–165కు సంబంధించి భూములిచ్చిన ఆకివీడు దుంపగడప, అజ్జమూరు తదితర గ్రామాల రైతులకు రూ.7.40 కోట్ల పరిహారాన్ని చెల్లిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సోమ వారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణితో కలిసి విలేకరులతో మాట్లాడారు. అలాగే లక్ష్మణేశ్వరం, సీతారాంపురం, మొగల్తూరు రైతులకు సుమారు రూ.6 కోట్లు చెల్లించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 40 ఆర్‌యూబీ, ఆర్వోబీలనిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. ఆర్డీవో కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎన్‌హెచ్‌ ఈఈ సంజీవరాయుడు పాల్గొన్నారు.

ఇళ్ల స్థలాల కోసం ధర్నా

భీమవరం: హౌస్‌ ఫర్‌ ఆల్‌ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓను తక్షణమే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారామ్‌ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో భీమవరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలిస్తామన్న కూటమి హామీని అమలు చేయా లన్నారు. అనంతరం వినతిపత్రం, అర్జీలను తహసీల్దార్‌ ఆర్‌.రాంబాబుకు అందజేశారు.

తాడేపల్లిగూడెంలో..

పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని, జీఓ 23ను తక్షణమే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్‌ చేశారు. సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిగూడెం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద హౌస్‌ ఫర్‌ ఆల్‌ అంటూ ధర్నా నిర్వహించి, అనంతరం తహసీల్దార్‌ ఎం.సునీల్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఆయిల్‌పామ్‌ రైతుల ఆక్రోశం

ద్వారకాతిరుమల: కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎం.నాగులపల్లిలో ఆయిల్‌పామ్‌ గెలల కాటా వద్ద ఆయిల్‌పామ్‌ రైతులు సో మవారం ధర్నా నిర్వహించారు. ఆయిల్‌పామ్‌ కు గిట్టుబాటు ధర కల్పించాలని, ఫ్యాక్టరీ యాజమాన్యాలు గెలల ఏరివేతను ఆపాలంటూ నినాదాలు చేశారు. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, మండల అధ్యక్షుడు బోయపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కౌలు రైతుల వినూత్న నిరసన

భీమడోలు: కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని, భూ యాజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం భీమడోలు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కౌలు రైతులు ధర్నా చేశారు. మండుటెండలో మోకాళ్లపై నిలిచి నిరసన తెలిపారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీని వాస్‌, జిల్లా కన్వీనర్‌ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేయాలన్నారు. అనంతరం ఎంపీడీఓ సీహెచ్‌ పద్మావతిదేవి, ఏఓ ఎస్‌పీవీ ఉషారాణికి వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement