
కదం తొక్కిన సీహెచ్ఓలు
ఏలూరు (టూటౌన్): తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సీహెచ్ఓలు మంగళవారం ఏలూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తమకు ఉద్యోగ, ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ నుంచి గిరిజన భవన్, కొత్త బస్టాండ్, జిల్లా పరిషత్ సెంటర్, ఫైర్ స్టేషన్ సెంటర్, డీఈఓ కార్యాలయం, ఎస్బీఐ సెంటర్ మీదుగా తిరిగి కలెక్టరేట్కు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా సీహెచ్ఓల సంఘం జిల్లా అడ్వయిజర్ కురెళ్ల సురేంద్ర, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సొంగా సిద్ధయ్య మాట్లాడుతూ ఆరేళ్లుగా సీహెచ్ఓలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ, ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్లో ప్రభుత్వ వాటాను జమ చేయాలని, అదనపు పనిభారం తగ్గించాలని కోరారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేంతవరకు సమ్మె కొనసాగించనున్నట్టు స్పష్టం చేశారు.