సెంట్రల్‌ బ్యాంకులో రుణాల కుంభకోణం | - | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ బ్యాంకులో రుణాల కుంభకోణం

May 6 2025 1:08 AM | Updated on May 6 2025 1:08 AM

సెంట్రల్‌ బ్యాంకులో రుణాల కుంభకోణం

సెంట్రల్‌ బ్యాంకులో రుణాల కుంభకోణం

నరసాపురం: పట్టణంలోని కోటిపల్లివారి వీధిలోని సెంట్రల్‌ బ్యాంకు బ్రాంచీలో భారీ రుణాల కుంభకోణం సోమవారం వెలుగుచూసింది. పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వేములదీవిలో 19 ఎకరాల రొయ్యల చెరువుకు సంబంధించి నకిలీ లీజు అగ్రిమెంట్లు సృష్టించి బ్యాంకులో సుమారు రూ.4 కోట్లు రుణాలు తీసుకున్నారు. చెరువు అసలు యజమానులు రుణం కోసం వేరే బ్యాంకుకు వెళ్లగా ఈ చెరువులపై ఇప్పటికే రుణాలు తీసుకున్నట్టు తెలియడంతో కుంభకోణం బయటపడింది. దీంతో అసలు యజమానులు తిరుమాని నాగరాజు, శ్రీనివాసరావు సెంట్రల్‌ బ్యాంకుకు వచ్చి మేనేజర్‌ టి.ప్రకాశంను నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి రాత్రి 9 గంటల వరకు బ్యాంకులో తనిఖీలు చేసి వివరాలు సేకరించారు.

కుంభకోణం జరిగిందిలా..

వేములదీవిలో తిరుమాని వడ్డికాసులు, పద్మ దంపతులకు 19 ఎకరాల రొయ్యల చెరువులు ఉన్నాయి. వడ్డికాసులు 2020లో మృతి చెందగా ఆయన ఇద్దరు కుమారులు నాగరాజు, శ్రీనివాసరావు ఆస్తి పంచుకున్నారు. ఇదిలా ఉండగా 2024లో పట్టణానికి చెందిన ప్రముఖుడు కూనపరెడ్డి ప్రసాద్‌, మరో వ్యక్తి దూడే చంద్రశేఖర్‌లు వడ్డికాసులు 19 ఎకరాల చెరువును తమకు లీజుకు ఇచ్చినట్టుగా నకిలీ అగ్రిమెంట్లు సృష్టించి సెంట్రల్‌ బ్యాంకులో రుణం పొందారు. బ్యాంకు అధికారులు ప్రసాద్‌ పేరున రూ. 2.36 కోట్లు, చంద్రశేఖర్‌ పేరున రూ.1.63 కోట్లు రుణాలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో వడ్డికాసులు కుమారుడు నాగరాజు మరో బ్యాంకులో రుణం నిమిత్తం సదరు చెరువుల డాక్యుమెంట్లు తీసుకువెళ్లగా మోసం బయటపడింది. దీంతో నాగరాజు, కొందరు గ్రామస్తులు సెంట్రల్‌ బ్యాంకుకు వెళ్లి మేనేజర్‌ను నిలదీశారు. తన తండ్రి 2020లో చనిపోతే 2024లో లీజు అగ్రిమెంట్‌ ఎలా రాశారని, రుణం ఎలా ఇచ్చారంటూ గొడవపడ్డాడు. బ్యాంకు వద్ద ఉద్రిక్తత ఏర్పడగా టౌన్‌ ఎస్సైలు ముత్యాలరావు, జయలక్ష్మి సిబ్బందితో వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బాధితుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ముత్యాలరావు చెప్పారు.

చక్రం తిప్పిన బ్రోకర్‌!

రుణాల కుంభకోణంలో మాధవ్‌ అనే బ్రోకర్‌ చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం బ్యాంకు అధికారుల పాత్రతోనే సాగినట్టుగా సమాచారం. భారీగా పర్సంటేజ్‌లు చేతులు మారినట్టు తెలిసింది. సదురు బ్రోకర్‌ పట్టణంలోని మిగిలిన కొన్ని బ్యాంకుల్లో కూడా చాలా మందికి ఈ తరహా రుణాలు ఇప్పించినట్టు వార్తలు వస్తున్నాయి.

నకిలీ అగ్రిమెంట్లతో రూ.4 కోట్లు గోల్‌మాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement