
నూరు శాతం క్షయ నివారణ లక్ష్యం
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో నూరు శాతం క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టర్ అధ్యక్షతన టీబీ ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద ఎవరైనా టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని ‘నిక్షయ్ మిత్ర’గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరారు. టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం నిమిత్తం నెలకు రూ.600ల విలువైన పోషకాహారం అందజేయాల్సి ఉంటుందన్నారు. తాను కూడా నిక్షయ మిత్ర కింద 25 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు దత్తత తీసుకుని ఆహారాన్ని అందిస్తానని ప్రకటించారు. అనంతరం క్షయ వ్యాధి లక్షణాలపై రూపొందించిన వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. డీఎంహెచ్ఓ జి.గీతాబాయి, అడిషనల్ డీఎంహెచ్ఓ బి.భానునాయక్, డీసీహెచ్ఎస్ పి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాల.. ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆర్థిక పురోభివృద్ధికి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసులపై విచారణ వేగవంతం చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు.
యోగాంధ్రకు ప్రణాళిక
భీమవరం: జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు భారీ ప్రణాళిక అమలు చేస్తున్నట్టు కలెక్టర్ నాగరాణి తెలిపారు. భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతివనంలో యోగా శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్రపై గ్రామ, మండల, జిల్లాస్థాయిలో విస్తృత అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడానికి కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.