
రాట్నాలమ్మకు రూ.56,105 ఆదాయం
పెదవేగి: రాట్నాలమ్మకు భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన రాట్నాలమ్మను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. ఈ వారం పూజా టిక్కెట్లపై రూ.26,300, విరాళంగా రూ.4,230, లడ్డూప్రసాదంపై రూ.23,175, ఫొటోల అమ్మకంపై రూ.2,400 కలిపి మొత్తం రూ.56,105 ఆదాయం లభించిందని దేవస్థాన ఈవో ఎన్.సతీష్కుమార్ చెప్పారు.
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మంగమ్మతల్లి గుడి భక్తులతో కిటకిటలాడింది. దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. క్యూలో నిలుచున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
కోడి వ్యర్థాలు తరలిస్తున్న వ్యాన్ స్వాధీనం
భీమడోలు: కోడి వ్యర్థాలు తరలిస్తున్న ముగ్గురిని ఆదివారం భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఐషర్ వ్యాన్ను సీజ్ చేశారు. విజయవాడకు చెందిన ఎం.రాంబాబు, ముసునూరు మండలం రంగంపేటకు చెందిన పిల్లి వెంకట రమణ హైదరాబాద్ నుంచి కోడి వ్యర్థాలను లింగంపాడులోని గంటా మోహనరావు ఆక్వా చెరువుకు తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వై.సుధాకర్ తన సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వాహనాన్ని సీజ్ చేసారు.

రాట్నాలమ్మకు రూ.56,105 ఆదాయం