పరకాల: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్రెడ్డి అన్నారు. పరకాల పట్టణంలోని అమరధామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటవీరులను సీపీఐ నాయకులు బుధవారం స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ తెలంగాణలో వీరోచిత పోరాటం చేసిందని గుర్తుచేశారు. తెలంగాణలోని నాలుగు వేల గ్రామాలను విముక్తి చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీకి దక్కుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి తెలపడం చారిత్రక అవసరమని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు అదరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, పరకాల మండల కార్యదర్శి దుప్పటి సాంబయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బొట్ల చక్రపాణి, మంద శ్రీకాంత్, బొచ్చు కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు


