నర్సంపేట: నేను చావలేదు... పడిపోయినా అంతే.. బతకాలని తపిస్తున్న.. ప్రకృతి ప్రేమికులారా నన్ను లేపి మరోచోటికి తరలించి పూర్తిస్థాయిలో సంరక్షించండి.. ఇది నర్సంపేట పట్టణ శివారులో నేలకొరిగిన ఓ మర్రి వృక్షం మౌన వేదన. ఏడాది క్రితం వీచిన భారీ గాలులకు కూకటి వేళ్లతో సహా నేలకొరిగిన ఆ మహా వృక్షం అందరూ చనిపోయిందనుకున్నారు. కొమ్మలు విరిగి నేలను తాకుతూ వేర్లు తెగిపోయి కనిపించేలా పడి ఉంది. కానీ, ఆ ప్రకృతి ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోదు కదా. పడిపోయినా ప్రాణంతోనే ఆ చెట్టు తిరిగి చిగురించింది.
వందేళ్ల వయస్సు..
ఈ మర్రి చెట్టు వయస్సు సుమారు వంద ఏళ్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. గాలివానకు కూలిపోయాక చెట్టును తొలగించాలని కొందరు భావించారు. భారీగా ఉండడంతో సాధ్య పడలేదు. దీంతో లేత ఆకులతో చిగురిస్తూ తనను కాపాడమని వేడుకున్నట్లు ఉంది.
బతకాలని తపిస్తూ..
ఇది కేవలం చెట్టు కాదు.. ఒక జీవ వైవిధ్య కేంద్రం. ఇలా నేలకొరిగిన చెట్టు చిగురించడమంటే బతకాలని ఎంతగా తపిస్తుందో అర్థమవుతోంది. అధికారులు జేసీబీతో తొలగించకుండా నిపుణుల సాయంతో మరో చోటికి తరలించి సంరక్షించాలని పర్యావరణవేత్తలు వేడుకుంటున్నారు.
నన్ను నిలబెడితే మీకు నీడనిస్తా
ఓ మర్రి వృక్షం మౌన వేదన


