
అభ్యంతరాలు ఉంటే తెలపాలి
కలెక్టర్ స్నేహశబరీష్
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని 12మండలాల్లో గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి ఈనెల 9న సవరించి 10వ తేదీన ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. హనుమకొండ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లలో 12 మండల పరిషత్, 12 జిల్లా పరిషత్లు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 3,70,871 మంది ఓటర్లు ఉండగా వారిలో మహిళలు 1,90,201, పురుషులు 1,80,666, ఇతరులు 4 ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లాలో 631 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించారు. అనంతరం రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జెడ్పీ సీఈఓ రవి సమాధానమిచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ.వి శ్రీనివాసరావు, శ్యామ్సుందర్, ప్రభాకర్రెడ్డి, సయ్యద్ ఫైజుల్లా, నిశాంత్, రజనీకాంత్, ఎండీ నేహాల్, ఇండ్ల నాగేశ్వర్రావు, ప్రవీణ్కుమార్, జయంత్లాల్, తదితరులు పాల్గొన్నారు.
17నుంచి స్వస్థ్ నారీ,
సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాలు..
మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా ఈనెల 17వ తేదీనుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. ఆయా కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళలకు నిర్దేశించిన ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులచే అన్ని రకాల పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని పాఠశాలలు, గురుకులాలు, కళాశాలల్లో విద్యార్థినులకు అనీమియా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య, జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ రవి, డీపీఓ లక్ష్మీరమాకాంత్, డీఈఓ వాసంతి, డీడబ్ల్యూఓ జయంతి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ నిర్మల, గిరిజన, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, డాక్టర్ గౌతమ్ చౌహాన్, జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, గైనకాలజిస్టుల సంఘం అధ్యక్షులు డాక్టర్ శ్రీలక్ష్మి, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, విజయకుమార్, మహేందర్, హిమబిందు పాల్గొన్నారు.