
కాలం.. ఆలస్యం
నర్సంపేట: జిల్లాలో లోటు వర్షపాతంతో పత్తి, మొక్కజొన్న పంటలు, వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది జూలై 16 నాటికి జలకళ లేక చెరువులు బోసిపోతున్నాయి. ముందు మురిపించిన వర్షాలు.. తీరా సమయానికి ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సాగునీటి వనరుల వెలవెల..
జిల్లాలో ప్రాధాన నీటి వనరులైన పాకాల, రంగాయ చెరువు, కోపాకుల, కోనారెడ్డి, ఎల్గూరు రంగంపేట చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతున్నాయి. గత సంవత్సరం ఇదేరోజు నాటికి 50 శాతం వరకు నీటి నిల్వ ఉండగా ఈ ఏడాది వర్షపు నీరు చేరనేలేదు. హనుమకొండ జిల్లాలోని కటాక్షపూర్ చెరువు ఆయకట్టు ఎక్కువ భాగం వరంగల్ జిల్లాలోనే ఉంది. ఈచెరువు నీటినిల్వ సామర్థ్యం 26 అడుగులు కాగా.. ప్రస్తుతం నాలుగు అడుగుల నీరు మాత్రమే ఉంది. మొత్తం 1,300 ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో ఆయా చెరువుల కింద ఉన్న ఆయకట్టు రైతులు ఈ ఏడాది పంటలపై ఆందోళన చెందుతున్నారు.
30 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం..
జిల్లాలోని 13 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. ఈ ఏడాది జూలై 16 నాటికి సాధారణ వర్షపాతం 284.7 మిల్లీమీటర్లు ఉండాలి. ఇప్పటివరకు 199 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో 30 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా ఉంది. భారీ వర్షాలు కురిస్తే నే భూగర్భ జలాలు పెరుగుతాయి. దీంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుకొని పంటలు పండే అవకాశం ఉంది.
3.10 లక్షల ఎకరాల్లో పంటల సాగు..
జిల్లాలో అన్ని పంటలు కలిపి 3.10 లక్షల ఎకరాల్లో సాగవుతున్నా యి. ఇందులో ప్రధానంగా వరి పంట 1.44 లక్షలు,మొక్కజొన్న 10 వేల ఎకరాలు,పత్తి 1.26 లక్షలు, మిర్చి 9 వేలు, కంది 1,200, పసుపు 950, ఇతర పంటలు 17,500 నుంచి 18 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగవుతుండగా 90 శాతం పంటలు వర్షాధారంపైనే ఉన్నాయి.
జిల్లాలో ప్రధాన నీటివనరులు, వాటి సామర్థ్యం,
ప్రస్తుత నీటినిల్వ, ఆయకట్టు వివరాలు..
నీటివనరు నీటి సామర్థ్యం ప్రస్తుత ఆయకట్టు
(ఫీట్లు) నీటినిల్వ (ఫీట్లు) (ఎకరాల్లో)
పాకాల 30 ఫీట్లు 17.5 30 వేలు
ఎల్గూరు 18 12 760
రంగాయ 17 4 1,600
కోపాకుల 12 1 2,000
జిల్లాలో ఈ సంవత్సరం
వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో)
మండలం కురిసింది సాధారణం లోటు
నర్సంపేట 223.0 330.2 –32.0
గీసుకొండ 236.5 272.9 –13.0
దుగ్గొండి 232.2 268.3 –13.0
నల్లబెల్లి 194.8 309.6 –37.0
ఖానాపురం 269.5 343.7 –22.0
చెన్నారావుపేట 241.2 317.9 –24.0
సంగెం 181.7 278.2 –35.0
వర్ధన్నపేట 163.9 214.6 –24.0
రాయపర్తి 115.3 238.8 –52.0
పర్వతగిరి 137.5 263.4 –48.0
నెక్కొండ 178.4 303.8 –41.0
ఖిలా వరంగల్ 180.5 279.3 –35.0
వరంగల్ 233.1 279.8 –17.0
ఎండిపోతున్న పంటలు
వెలవెలబోతున్న చెరువులు
జిల్లాలో లోటు వర్షపాతం
ఆందోళన చెందుతున్న రైతులు
మొక్కజొన్న పంటకు నీరు అందిస్తున్న ఈ రైతు పేరు కొయ్యడి లక్ష్మయ్య. నల్లబెల్లి మండలం కన్నారావుపేట శివారులో 40 గుంటల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని 25 రోజుల క్రితం మొక్కజొన్న పంట వేశాడు. వర్షాలు కురవకపోవడంతో వాడిపోతున్న పంటను కాపాడుకునేందుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఓ వ్యవసాయ బోరును అద్దెకు తీసుకున్నాడు. అక్కడి నుంచి పైపులు వేసి నీటిని అందిస్తున్నాడు. వర్షాలు సమృద్ధిగా లేకపోవడంతో నీరు అందించేందుకు ఆయన అనేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇది ఒక లక్ష్మయ్య పరిస్థితి మాత్రమే కాదు.. జిల్లాలోని అనేక మంది రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.

కాలం.. ఆలస్యం