
భవానీశంకరాలయంలో పీసీసీ చీఫ్ పూజలు
సంగెం/గీసుకొండ: సంగెం మండలంలోని చింతలపల్లి భవానీశంకరాలయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్గౌడ్, సంధ్యారాణి దంపతులు ఆదివారం సందర్శించారు. కాకతీయుల కాలం నాటి భవానీశంకర మహా కాలబైరవాలయం ఆలయపూజారి సముద్రాల సుదర్శనాచార్యుల ఆధ్వర్యంలో వారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భవానీశంకరాలయంలో రుద్రాభిషేకం, మహాకాలభైరవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గీసుకొండ మండలంలోని ఊకల్లోని నాగేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జీవీఎస్ శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు శ్రీహర్ష, గుమిళ్ల విజయ్కుమారచార్యులు, కొండపాక రాజేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఎలాంటి ప్రోటోకాల్, హంగు, ఆర్బాటం లేకుండా గోప్యంగా దేవతామూర్తులను సందర్శించి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించడం విశేషం. ఇదిలా ఉండగా.. తన పర్యటనకు సంబంధించి ఎవరూ ఫొటోలు, వీడియోలు తీయొద్దని, ఇది తన వ్యక్తిగత విషయమని చెప్పినట్లు సమాచారం.
సివిల్స్ ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష
కేయూ క్యాంపస్: సివిల్ సర్వీస్ ఉచిత శిక్షణకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించారు. ఉదయం 10–30 నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 440 మంది అభ్యర్థులు హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ సెల్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ జగన్మోహన్ తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును ఎస్సీ వెల్ఫేర్ అధికారి బి.నిర్మల, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రమాదేవి పరిశీలించారు.
రామప్పలో పర్యాటకుల సందడి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వర స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఆలయ ప్రధాన పూజారి హరీశ్ శర్మ భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. గైడ్ కుమార్ ఆలయ విశిష్టత గురించి పర్యాటకులకు వివరించారు.
ఇంటి మెట్లు కూలి బాలుడి మృతి
నర్సంపేట: ప్రమాదవశాత్తు ఇంటి మెట్లు కూలి మీద పడడంతో బాలుడు మృతి చెందిన సంఘటన చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన అర్ష మహేందర్–సునీత దంపతుల కుమారుడు అనుదీప్(13) ఆదివారం సెలవు కావడంతో గ్రామంలోని బీరన్న గుడి వద్ద తోటి మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. క్రికెట్ బాల్ సమీపంలోని షేక్ ఇమామ్ ఇంటి సమీపంలో పడింది. ఆ బాల్ను తీసుకురావడానికి అనుదీప్ వెళ్లాడు. బాల్ కోసం వెతుకుతుండగా ఒక్కసారిగా ఇంటి మెట్లు కూలి అతనిపై పడ్డాయి. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

భవానీశంకరాలయంలో పీసీసీ చీఫ్ పూజలు

భవానీశంకరాలయంలో పీసీసీ చీఫ్ పూజలు

భవానీశంకరాలయంలో పీసీసీ చీఫ్ పూజలు