
యూరియా సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు
న్యూశాయంపేట: యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో యూరియా నిల్వలు, సరఫరా తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ ఆదివారం సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు యూరియా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీరోజు సరఫరాపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. రైతుల రద్దీ తగ్గించేందుకు టోకెన్ విధానాన్ని అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు నిర్వహించాలని చె ప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్రావు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ సత్యశారద