
ఆన్లైన్ జీరో పర్మిట్ అమలుచేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్ : ప్రభుత్వ పనులకు సంబంధించి చిన్న తరహా ఖనిజాలైన కంకర, మట్టి కోసం ఆన్లైన్ జీరో పర్మిట్ అమలు చేయాలి.. ఈ విధానంపై కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో మైనింగ్, టీజీఎండీసీ, రెవెన్యూ, పోలీస్, రవాణా తదితర శాఖల అధికా రులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంజనీరింగ్ శాఖల అధికారులు ప్రభుత్వ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు ఆన్లైన్ జీరో పర్మిట్కు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదించడం వల్ల అక్రమ ఖనిజ రవాణాను అరికట్టవచ్చని చెప్పారు. వాగుల్లో ఇసుక వెలికితీత, అక్రమ రవాణాపై పరిపాలనా పరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా నికి ఇసుక అవసరం ఎంతో ఉందని, సాండ్ బజార్ ద్వారా ఆన్లైన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నా రు. ధర్మసాగర్, హసన్పర్తి, ఆత్మకూరు మండలా ల్లో సాండ్ బజార్ కోసం ఐదు ఎకరాల చొప్పున స్థలం గుర్తించాలని, శుక్రవారం నుంచి లబ్ధిదారులకు కూపన్లు ఇవ్వాలని తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
‘భోజన’ పథకం పక్కాగా అమలుచేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పక్కాగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ, డీఆర్డీఓ, వైద్య ఆరోగ్య, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన స్టీరింగ్, మానిటరింగ్ కమిటీ జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 470 పాఠశాలలు ఉండగా 324 స్కూళ్లకు వంట గదిలు అందుబాటులో ఉన్నాయని, మిగతా వాటికి నిర్మించాల్సి ఉందని, ప్రతిపాదనలు త్వరగా పంపించాలని డీఆర్డీఓ మేన శ్రీనును ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో అవసరమైన వంట సామగ్రికి రూ.50 లక్షలు వెచ్చించినట్లు పేర్కొన్నారు. వంట కార్మికులకు కనీసం మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. అన్ని పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి సిలిండర్లు సరఫరా చేయాలని తెలిపారు. మూడు నెలలకోసారి ఆహార పదార్థాల నాణ్యత పరీక్షలను నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో డీఈఓ వాసంతి, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆపద సమయంలో సిద్ధంగా ఉండాలి
హన్మకొండ: విపత్తు, ప్రమాదాలు వంటి ఆపద సమయాల్లో సహాయం అందించేందుకు ఆపద మిత్రలు సిద్ధంగా ఉండాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థల ఆదేశాల మేరకు జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యాన ఆపద మిత్రలకు హనుమకొండలో ని అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన శిక్షణ శిబిరం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుకోని ప్రమాదాలు జరిగినా.. విపత్తులు సంభవించినా వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో పాటు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రకృతి విపత్తులు, ఆపద సమయాల్లో కాపాడటం, సహాయం చేయడంపై శిక్షణలో నేర్చుకున్న అంశాలను పదిమందికి నేర్పించాలని పేర్కొన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి నాగరాజు మాట్లాడుతూ మడికొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో 126 మంది, పరకాలలో 131 మంది వలంటీర్లకు 12 రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆపద మిత్ర వలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల, పరకాల మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ జయశ్రీ, సైకాలజిస్ట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.