
విద్యార్థులకు గ్రాండ్ వెల్కమ్
విద్యారణ్యపురి: వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పండుగ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. వివిధ చోట్ల స్కూళ్లను మామిడి తోరణాలు, పూలు, బెలూన్లతో అలంకరించి పిల్లలకు తొలిరోజే గొప్ప అనూభూతి కలిగేలా ఆహ్వానం పలికారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలు అందజేసి స్వాగతించారు. ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశాలు కూడా నిర్వహించారు. కొందరు తమపిల్లలతోపాటు పాఠశాలలకు వచ్చారు. వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన చిన్నారులు మారాం చేస్తుండగా బుజ్జగించడం కనిపించింది.
పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్
హనుమకొండ జిల్లాలో 477, వరంగల్ జిల్లాలో 558 పాఠశాలల్లో తొలిరోజు హాజరైన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందజేశారు. హనుమకొండ పోచంపల్లి పాఠశాలలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ ప్రావిణ్య, డీఈఓ వాసంతి, కమలాపూర్ భీంపెల్లిలో జెడ్పీసీఈఓ విద్యాలత, ఎలకతుర్తి మండలం వల్బాపూర్ జెడ్పీఎస్ఎస్లో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రా యి జెడ్పీహెచ్ఎస్, పల్లారిగూడెం యూపీఎస్లను జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ కె.సుభాష్ సందర్శించారు. వరంగల్ కృష్ణాకాలనీ ప్రభుత్వ పాఠశాలలో 300ల మంది విద్యార్థులకు 150 మంది, హనుమకొండ పోచంపెల్లి పాఠశాలలో 180 మందికి 100 మంది హాజరయ్యారు. వరంగల్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజ పలు పాఠశాలలను సందర్శించి పర్యవేక్షించారు.
పునఃప్రారంభమైన పాఠశాలలు
మామిడి తోరణాలతో అలంకరణ
విద్యార్థులకు పూలతో స్వాగతం
తొలిరోజు 30శాతం వరకే
విద్యార్థుల హాజరు