
కమిషనరేట్లో వరుస దొంగతనాలు
● ఒక్కో పోలీస్
స్టేషన్లో పదుల సంఖ్యలో
కేసులు పెండింగ్
● స్టేషన్ల చుట్టూ తిరిగి
విసిగి పోతున్న బాధితులు
● కనిపించని పోలీస్
పెట్రోలింగ్..
● సమీక్షలకే అధికారులు పరిమితం
కమిషనరేట్ పరిధిలో చోరీలు ఇలా..
● ఈ ఏడాది జనవరి 21న హనుమకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తూరుజెండా, సుభాష్కాలనీలో తాలం వేసిన ఓ ఇంట్లో దొంగలు పడి 178 గ్రాముల బంగారు అభరణాలు ఎత్తుకెళ్లారు. ఇదే నెలలో కొత్తూరుజెండాలో రూ.3.50 లక్షల విలువైన బంగారు ఆభరణాల చోరీ జరిగింది. ఇదే పోలీస్స్టేషన్ పరిధి కాకాజీ కాలనీలోని ఓ ఆస్పత్రిలో ఏప్రిల్ 8న బ్యాగులో బంగారం పెట్టి స్నానింగ్కు వెళ్లి వచ్చే సరికి బ్యాగు అపహరణకు గురైంది. అందులో 7 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి.
● ఏప్రిల్ 5న హనుమకొండ పోలీస్స్టేషన్ పరిధి నయీంనగర్లో 5 తులాల బంగారం, రూ.50 వేల నగదు దొంగతనం జరిగింది.
● మామునూరు పోలీస్స్టేషన్ పరిధి బొల్లికుంట, సింగారంలో ఏప్రిల్లో రూ.15 లక్షల నగదు, రూ.2.50 లక్షల విలువైన బంగారు అభరణాలు చోరీకి గురయ్యాయి.
● మే నెలలో ఖానాపూర్ మండల కేంద్రంలో చోరీ జరిగి రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు పోయాయి. అలాగే.. కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధి కృష్ణాకాలనీలో రూ.10 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధి వెంకటేశ్వర కాలనీలో రూ.17 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి.
● ఈనెల 8న మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధి పడమర కోటలో జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు తన ప్రేయసిని సంతోష పెట్టడానికి తన ఇంట్లోనే చోరీ చేసి 16 తులాల బంగారం ఎత్తుకుపోయి పోలీసులకు చిక్కిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే పోలీస్స్టేషన్ పరిధి గణేశ్నగర్లో ఈనెల 11న చోరీ జరిగి 7 తులాల బంగారం, 70 తులాల వెండి ఆభరణాలు పోయాయి.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ట్రైసీటీల్లో ఎక్కడ ఎప్పడు దొంగతనం జరుగుతుందో.. ఎంత నష్టపోవాల్సి వస్తుందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కమిషనరేట్ పరిధిలో అంతర్రాష్ట్ర దొంగలతోపాటు స్థానిక దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి, ఒకటి రెండు రోజులు హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో బాధితులు పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. కమిషనరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఒక్క హన్మకొండ పోలీస్స్టేషన్ పరిధిలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు 35 చోరీలు జరిగాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో చోరీలు రాత్రి పూట ఎక్కువగా జరిగేవి. అయితే ఇటీవల రాత్రి, పగలు తేడా లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులు కేవలం పండుగల సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మిగితా సమయంలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రూ.కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఇంకా రికవరీ కాలేదు.
జాడలేని పెట్రోలింగ్
ఒకపక్క జోరుగా చోరీలు జురుగుతుంటే మరో పక్క పోలీస్ పెట్రోలింగ్ జాడ లేకుండా పోయిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీస్ ఉన్నత అధికారులు ప్రతీ సమీక్ష సమావేశంలో విజుబుల్ పోలీసింగ్ పెంచాలని కింది స్థాయి అధికారులకు పదే పదే చెబుతున్నా.. చాల మంది అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. అధికారుల ఆదేశాలను అలా విని ఇలా వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాలు తిరగడం లేదు. స్థానిక దొంగలు ఇలాంటి విషయాలను పసిగట్టి ఆ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనం జరిగిన తర్వాత పోలీసులు అప్రమత్తమై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఫలితం లేకుండా పోతోంది. పోలీస్ ఉన్నతాధికారులు కేవలం సమీక్షలకే పరిమితం అవ్వడం వల్లే క్షేత్ర స్థాయిలో అధికారులు దొంగలను పట్టుకోవడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారులు దృష్టిసారించేనా..?
కమిషనరేట్ పరిధిలో చోరీలతో పాటు చైన్స్నాచింగ్లు, ద్విచక్ర వాహనాలు పదుల సంఖ్యలో పోతున్నాయి. అధికారులు రికవరీ మాత్రం నామమాత్రంగా చూపిస్తున్నారు. ద్విచక్ర వాహనాలను పోగొట్టుకున్న బాధితులు పోలీస్స్టేన్ల చుట్టూ తిరుగుతున్నా అధికారులు కేసులు నమోదు చేయడం లేదు. వెతుకుతున్నాం.. దొరికితే అప్పగిస్తాం.. కేసులు పెడితే కోర్టు నుంచి రికవరీ చేసుకోవాల్సి ఉంటుందని భయపెట్టి కేసుల నమోదులో జాప్యం చేస్తున్నారు. నెలల తరబడి తిరిగినా కేసులు నమోదు చేయకపోవడంతో బాధితులు వారి బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మధ్యలోనే వదిలేస్తున్నారు. నగరంలోని చాల పోలీస్స్టేషన్ల పరిధిలో ఎన్ని చోరీలు జరిగినా వాటి రికవరీ విషయంలో అధికారులు శ్రద్ధ పెట్టడం లేదనే విషయం ఉన్నత అధికారుల సమీక్షల్లో వెల్లడయినా చర్యలు లేకపోవడంతో రికవరీ ఎక్కడ వెసిన గొంగ ళి అక్కడే అన్న చందంగా తయారైంది.